అమరావతి రాజధాని పనుల పున:ప్రారంభం పేర కూటమి సర్కార్ చేసిన అట్టహాసం తప్ప ప్రజలకు ఉపయోగపడింది ఏమి లేదు. ఈసారైనా రాజధాని నిర్మాణానికి మోడీ నిధులు ప్రకటిస్తారని ప్రజలు భావించారు కానీ మాటలతోటే సరిపెట్టారు. దీనిని ప్రజలు అంతా గమనించారు కూడా. ఇక అమరావతి పేరుతో జరుగుతున్న అభివృద్ధిని గమనిస్తే ఖచ్చితంగా ఇది కార్పొరేట్లకు పెద్దపీట వేసేలానే ఉంది. ఎందుకంటే మరావతి రాజధానే దేశంలో తొలి కార్పొరేట్ రాజధాని కాబోతుంది అన్నది విశ్లేషకుల అభిప్రాయం.
ఇందుకు ప్రధానకారణం భూమి సేకరణ పద్ధతే. ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (ఏపీసీఆర్డీఏ), అమరావతి కార్పొరేషన్ సంస్థ (ఏడీసీ)లను ఏర్పాటు చేశారు. మొత్తం ల్యాండ్ పూలింగ్ ద్వారా 34,390 ఎకరాలను సుమారు 28,740 మంది రైతుల నుండి సేకరించిన విషయం తెలిసిందే. ఇదికాక చుట్టూ ఉన్న ప్రభుత్వ భూమితో కలిపి మొత్తం 53 వేల ఎకరాల భూమిని మొదటి దశలో సమీకరించారు.
ఇప్పుడు అంతర్జాతీయ విమానాశ్రయం, అంతర్జాతీయ క్రీడా మైదానాలు ఇలా మరికొన్ని ప్రాజక్టుల పేర రెండో దశలో మరో 44 వేల ఎకరాల భూసేకరణకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు చంద్రబాబు ప్రకటించడాన్ని చూస్తే ఖచ్చితంగా ఇది ఎవరి ప్రయోజనాల కోసమో అర్ధమవుతుంది. ఇక రాజధాని నిర్మాణంలో భూసేకరణకు అంతం ఉండదని హింట్ ఇస్తూ ప్రైవేట్ పెట్టుబడుల ప్రయోజనాల కోసం నిరంతరం విస్తరించుకుంటూ పోతామనే సంకేతాన్ని ఇచ్చారు చంద్రబాబు.
ఇందుకు అనుగుణంగానే రాజధానిని 12 జోన్లుగా విభజించారు. పరిపాలన, నివాస, న్యాయ, వ్యాపార, ఎలక్ట్రానిక్స్, నాలెడ్జ్, ఆరోగ్య, క్రీడా, పర్యాటక ఇలా నవనగరాల పేర్లతో ప్రైవేట్ వ్యక్తులకు భూమిని దారాధత్తం చేస్తున్నారు.
2018 లోనే అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు అమరావతి బాండ్స్ పేర రూ.2 వేల కోట్లు 10.32 శాతం వడ్డీతో సమీకరించిన విషయం తెలిసిందే. ఇలా అనేక రూపాల్లో రాజధాని నిర్మాణం పేరుతో అప్పుల సేకరణ కొనసాగుతోంది. అలాగే భూముల అమ్మకం ద్వారా పెద్ద ఎత్తున నిధులు సేకరించి నిర్మాణానికి వినియోగించడం మరో ముఖ్యమైనది. ఇలా అమరావతి పేరుతో అభివృద్ధిని పక్కకుపెట్టి రోజుకో స్టేట్మెంట్తో ప్రజలను కూటమి ప్రభుత్వం మభ్యపెడుతుందన్న వాదన లేకపోలేదు. మరికొంతమందైతే ఇది ఎన్నటికీ ప్రజా రాజధాని కాదు. కాబోదు. అతి కొద్ది మంది సంపన్నులు, మధ్యతరగతి ప్రజలకు మాత్రమే ఇక్కడ జీవించే అవకాశం ఉంటుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
The post అమరావతి..ప్రజా రాజధానేనా! appeared first on Adya News Telugu.