తెలంగాణలో ఉద్యోగుల సమ్మె వ్యవహారం.. ప్రభుత్వం పోరాటం వ్యవహారం.. కాక రేపుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి వారిపై ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు. మీరు ఎవరిపై పోరాటం చేస్తున్నారంటూ .. నిలదీశారు. అయితే.. ఆయన హెచ్చరికలు, విమర్శలను ఏమాత్రం లెక్క చేయకుండానే ఆర్టీసీ కార్మిక సంఘాలు.. ఉద్యమానికి రెడీ అయ్యాయి. ఆర్టీసీలో సమ్మె సైరన్ను మోగించాయి. ఈ రోజు అర్ధరాత్రి నుంచి ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగుతున్నట్టు నోటీసులు అందించారు.
వాస్తవానికి ఈ వ్యవహారంపై స్పందించిన మంత్రి పొన్నం ప్రభాకర్.. కార్మికులు ఉద్యమానికి రెడీ కావొద్దని సమస్యలు పరిష్కరిస్తామని ప్రకటించారు. కానీ, తక్షణం తమకు ఉపశమనం కల్పించాలన్నది ఆర్టీసీ కార్మికుల వాదన. ఈ క్రమంలో మంత్రి వ్యాఖ్యలను కూడా వారు పట్టించుకోకుండానే మంగళవారం అర్ధరాత్రి నుంచి సమ్మెకు రెడీ అయ్యారు. అదేసయమంలో సమ్మె చేస్తే ఎస్మా ప్రయోగిస్తామని ప్రభుత్వం హెచ్చరించినా లెక్కచేయక పోవడం గమనార్హం.

దీంతో బుధవారం నుంచి డిపోలకే పరిమితం కానున్న ఆర్టీసీ బస్సులు.. ప్రయాణికులకు తీవ్ర ఇక్కట్లు మిగల్చనున్నాయి. ఇక, ఆర్టీసీ కార్మికుల 21 సమస్యలు నెరవేర్చాలని డిమాండ్ వినిపిస్తున్నారు. వీటిలో పెండింగు వేతనాలు ఉన్నాయి. భత్యాలు కూడా ఉన్నాయి. అదేసమయంలో తమపై నమోదు చేస్తున్న కేసులను కూడా ఎత్తివేయాలని కోరుతున్నారు. అయితే.. సర్కారు మాత్రం పోరుకు కాకుండా చర్చలకు రావాలని పిలుపునిచ్చింది.
ఇదిలావుంటే.. కార్మిక సంఘాల్లోనూ రెండు వర్గాలు ఏర్పడ్డాయి. సమ్మెకు సిద్ధమైన జేఏసీ నాయకుడు వెంక న్న వర్గం..సర్కారుతో అమీతుమీ తేల్చుకునేందుకు రెడీగా ఉన్నట్టు పేర్కొన్నారు. అయితే.. సీఎం చెప్పినట్టు విందామని.. సమ్మెకు కాకుండా చర్చలకు రెడీ అవుదామని.. మరో నేత అశ్వత్థామ రెడ్డి వర్గం చెబుతోంది. అయితే.. అశ్వత్థామ రెడ్డికి వ్యతిరేకంగా కార్మికులు నిప్పులు చెరిగారు. ఆర్టీసీ కార్మిక ద్రోహి అని అశ్వత్ధామపై తెలంగాణ ఆర్టీసీ జేఏసీ నేతలు విమర్శలు గుప్పించారు.