News
oi-Mamidi Ayyappa
YS Jagan: రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన అనేక విషయాలపై విన్నవించేందుకు ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దిల్లీ పర్యటన చేశారు. ఈ క్రమంలో నిన్న కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిసిన సీఎం నేడు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను కలిశారు. ఈ భేటీలో రాష్ట్రానికి సంబంధించిన నిధులు, అభివృద్ధికి సంబంధించిన విషయాలపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది.
ఉపాధి హామీ పనులకు సంబంధించి రాష్ట్రానికి ఇవ్వాల్సిన బకాయిలు సుమారు రూ.2,500 కోట్లు ఉన్నాయని వాటిని వెంటనే విడుదల చేయాలని సీఎం జగన్ ఆర్థిక మంత్రిని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం నిబంధనలకు అనుగుణంగానే అప్పులు చేస్తోందని అయినా ఆంక్షలు పెట్టడంపై విన్నవించారు. 2021-22లో రూ.42,472 కోట్ల రుణపరిమితి కల్పించి.. తర్వాతి కాలంలో దానిని రూ.17,923 కోట్లుకు తగ్గించిన విషయాన్ని నిర్మలమ్మ దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయంలో రాష్ట్రానికి వెసులుబాటు కల్పించాలని కోరారు.

తెలంగాణ డిస్కంల నుంచి 2014-2017 మధ్య కాలంలో విద్యుత్ సరఫరాకు చెందిన రూ.7,058 కోట్ల బకాయిలను ఇప్పించాలని కోరారు. 2014-15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పెండింగ్ లో ఉన్న రూ.36,625 కోట్ల రీసోర్స్ గ్యాప్ ఫండింగ్ వెంటనే విడుదల చేయాలని సీఎం జగన్ విన్నవించారు.
పోలవరం ప్రాజెక్టును వేగవంతంగా ముందుకు తీసుకెళ్లడానికి అడహాక్గా రూ.10 వేల కోట్లు మంజూరుచేయాలంటూ విజ్ఞప్తి చేశారు. డయాఫ్రంవాల్ ప్రాంతంలో అవసరమైన మరమ్మతులకు రూ.2,020 కోట్లు అవసరం ఉన్నందున ఆ నిధులను విడుదల చేసి పనులు వేగంగా ముందుకు తీసుకెళ్లటానికి సహకరించాలని కోరారు.
ఏపీ జీవనాడి పోలవరాన్ని పూర్తిచేసేందుకు రాష్ట్రం ఖర్చుచేసిన రూ.2,600.74 కోట్ల సొంత నిధులను రీయింబర్స్ చేయాలని కోరారు. దీనికి తోడు పోలవరం ప్రాజెక్టు అంచనాలను టెక్నికల్ అడ్వయిజరీ కమిటీ రూ.55,548 కోట్లుగా నిర్థారించిందని.. దానికి కేంద్రం ఆమోదం తెలపాలని కోరారు. చివరిగా ఎప్పటి నుంచో అడుగుతున్న ప్రత్యేక హోదా అంశాన్ని ఆర్థిక మంత్రి వద్ద ప్రస్తావిస్తూ.. పార్లమెంటు సాక్షిగా కేంద్రం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని విజ్ఞప్తి చేశారు.
English summary
Andhra pradesh CM YS Jagan met Union finance minister Nirmala Sitharaman Over funds under pending
Andhrapradesh CM YS Jagan met Union finance minister Nirmala Sitharaman Over funds under pending.
Story first published: Thursday, March 30, 2023, 15:42 [IST]