సాయి సూర్య డెవలపర్స్ రియల్ ఎస్టేట్ సంస్థ, సురానా గ్రూప్ కంపెనీలకు టాలీవుడ్ స్టార్ హీరో మహేశ్ బాబు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఆ సంస్థల ప్రమోషన్ల కోసం మహేశ్ బాబు రూ. 5.90 కోట్లు స్వీకరించారని ఈడీ వర్గాలు భావిస్తున్నాయి. మనీ లాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ సంస్థల్లో పెట్టుబడులు పెట్టేలాగా ప్రజలను మహేశ్ బాబు ప్రోత్సహించారని ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో 27న విచారణకు హాజరు కావాలని ఈ నెల 22న మహేశ్ బాబుకు ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు.
అయితే, నేడు ఈడీ విచారణకు హాజరు కాలేనని అధికారులకు మహేశ్ బాబు లేఖ రాశారు. ముందస్తుగా ఖరారైన సినిమా షూటింగ్ షెడ్యూల్ వల్ల విచారణకు రాలేనని, రేపు కూడా షూటింగ్ ఉందని లేఖలో పేర్కొన్నారు. విచారణకు హాజరయ్యేందుకు మరో తేదీని కేటాయించాలని ఈడీ అధికారులను కోరారు. మహేశ్ బాబు అభ్యర్థనపై ఈడీ అధికారులు ఏ విధంగా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.
