ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి పునఃనిర్మాణ పనులను నిన్న దేశ ప్రధాని నరేంద్ర మోదీ తన చేతుల మీదగా ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే నిన్ననే ఏపీ లో మరో నిశ్శబ్ద అంకురార్పణ కూడా జరిగింది. అదిప్పుడు అంతర్జాతీయ మీడియా మరియు మ్యాగజైన్ల ముఖ్యాంశంగా మారింది. స్టాక్ మార్కెట్లలో సదరు స్టాక్స్ ను కూడా ప్రభావితం చేసింది. విశ్వంలోని అత్యంత సంక్లిష్టమైన రహస్యాలను ఛేదించే శక్తి మన ముంగిట నిలవబోతోంది. అదే – క్వాంటం కంప్యూటింగ్. ఇది కేవలం ఒక సాంకేతికత కాదు.. ఇది భవిష్యత్తును మార్చేసే ఒక శక్తి.
అటువంటి క్వాంటం కంప్యూటింగ్ రంగంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దేశానికే మార్గదర్శిగా నిలపాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ముందడుగు వేశారు. అమరావతిలో అత్యాధునిక క్వాంటం వ్యాలీ టెక్ పార్క్ ఏర్పాటు కోసం ఐబీఎం (IBM), టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS), లార్సన్ అండ్ టూబ్రో (L&T) వంటి దిగ్గజ సంస్థలతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ న్యూ టెక్ పార్క్తో ఏపీ క్వాంటం విప్లవానికి కేంద్రం కాబోతోంది.. చరిత్ర సృష్టించబడబోతుంది.
నిన్న ఈ ప్రకటన చంద్రబాబు సమక్షంలో వెలువడగానే ప్రపంచవ్యాప్తంగా టెక్ దిగ్గజాలు సంభ్రమాశ్చర్యాలకు గురయ్యాయి. విద్యార్థులు, యువత ఈ పరిణామాన్ని తమ భవిష్యత్తుకు ఒక గొప్ప అవకాశంగా భావిస్తున్నారు. సోషల్ మీడియాలో టెక్కీల కేరింతలు కొట్టారు. మరోవైపు స్టాక్ మార్కెట్లో IBM మరియు TCS షేర్లు స్వల్పంగా పెరిగాయి. క్వాంటం టెక్నాలజీ భవిష్యత్తులో తిరుగులేని శక్తిగా ఎదుగుతుందనే నమ్మకంతో ఇన్వెస్టర్లు ఈ దీర్ఘకాలిక పెట్టుబడిని ఒక సువర్ణావకాశంగా భావిస్తున్నారు.
భారతదేశపు మొట్టమొదటి క్వాంటం వ్యాలీ టెక్ పార్క్ అమరావతిలో రూపుదిద్దుకోబోతోంది. ఇది కేవలం ఒక భవనం కాదు.. భవిష్యత్తు తరాల పరిశోధనలకు, ఆవిష్కరణలకు ఒక వ్యాలీ. 156 క్యూబిట్ సామర్థ్యం కలిగిన అత్యాధునిక హెరాన్ ప్రాసెసర్తో ఇది పనిచేస్తుంది. సామాన్య కంప్యూటర్లు తలమునకలయ్యే లెక్కలను సైతం ఇది క్షణాల్లో కంప్లీట్ చేసేస్తుంది. క్లిష్టమైన సమస్యలకు క్వాంటం పరిష్కారాలను కనుగొనడంలో, వైద్యం నుండి తయారీ వరకు వివిధ రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకురావడంలో TCS తన మేధోశక్తిని ఉపయోగించనుంది.
అలాగే ఈ టెక్ పార్క్లోని శాస్త్రవేత్తలకు IBM యొక్క శక్తివంతమైన క్లౌడ్ క్వాంటం కంప్యూటర్లను అందుబాటులోకి తీసుకురానుంది. మరోవైపు ఈ టెక్ పార్క్ యొక్క మౌలిక సదుపాయాల అభివృద్ధిని L&T పర్యవేక్షించనుంది. ఈ ప్రతిష్ఠాత్మక క్వాంటం వ్యాలీ కార్యకలాపాలను 2026 జనవరి 1 నాటికి ప్రారంభించడమే లక్ష్యంగా నిర్దేశించారు. ఈ క్వాంటం కలను నిజం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తోంది. అమరావతిని క్వాంటం కంప్యూటింగ్ టెక్ పార్కును ప్రపంచ పటంలో ఒక ప్రత్యేక స్థానంలో నిలబెట్టాలనే దృఢ సంకల్పంతో చంద్రబాబు ముందు సాగుతున్నారు. ఫలితంగా వేలాది అత్యాధునిక ఉద్యోగాలు సృష్టించబడతాయి, ప్రపంచ నలుమూలల నుండి మేధావులు తరలివస్తారు, భారీగా పెట్టుబడులు రాష్ట్రానికి వస్తాయి. GST నిర్వహణ నుండి ఖచ్చితమైన జనాభా లెక్కల విశ్లేషణ వరకు, ప్రతి రంగంలోనూ క్వాంటం టెక్నాలజీ ఒక కొత్త శకానికి నాంది పలుకుతుందని ప్రభుత్వం విశ్వసిస్తోంది.
The post ఏపీ క్వాంటం విప్లవానికి కేంద్రం కాబోతుందా..? first appeared on namasteandhra.