వివిధ కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటూ అరెస్ట్ అయిన వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ ప్రస్తుతం విజయవాడ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్న విషయం తెలిసిందే. ఫిబ్రవరి నుంచి ఆయన జైలు జీవితాన్నే గడుపుతున్నారు. మరోవైపు ముంబై నటి కాదంబరి జత్వానీపై వేధింపులకు పాల్పడిన కేసులో ఏ2గా ఉన్న ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులు ఇటీవలె అరెస్ట్ అయ్యారు.
మంగళవారం హైదరాబాద్లోని నివాసంలో పీఎస్ఆర్ ను అరెస్ట్ చేసిన సీఐడీ అధికారులు.. బుధవారం విజయవాడలోని సీఐడీ కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానం ఆంజనేయులుకు 14 రోజుల రిమాండ్ విధించింది. ప్రస్తుతం ఆంజనేయులు కూడా వంశీ ఉన్న జైలులోనే రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. వంశీ, ఆంజనేయులు మధ్య గతంలో వైరం నడిచింది. ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకున్నారు.

ఈ పరిణామాల నేపథ్యంలో పీఎస్ఆర్ ఆంజనేయులు, వంశీలను ఒకే సెల్ లో ఉంచాలంటూ టీడీపీ నేత బుద్ధా వెంకన్న సెటైరికల్ ట్వీట్ చేశారు. జైలు సూపరింటెండెంట్ ను ఉద్దేశిస్తూ.. `విజయవాడ జైల్లో ఎవరైనా తోడు కావాలంటూ కోరుతున్న వంశీ, ఎక్కడ ఉన్నా పక్కన ఎవరో ఒకరు ఉండాలి పీఎస్సార్ ఆంజనేయులుకి.. కావున వీరిద్దరిని ఒకే సెల్ లో పెట్టాలని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు..` అంటూ బుద్ధా ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ కాస్త ఇప్పుడు వైరల్ గా మారింది.