ముంబై నటి కాదంబరి జత్వానీపై వేధింపులకు పాల్పడిన కేసులో ఏ2గా ఉన్న ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులు ఇటీవల అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. మంగళవారం హైదరాబాద్లోని నివాసంలో పీఎస్ఆర్ ను అరెస్ట్ చేసిన సీఐడీ అధికారులు.. అదే రోజు విజయవాడ తరలించారు. విజయవాడలోని సీఐడీ కార్యాలయంలోనే 7 గంటల పాటు ఆయన్ను ప్రశ్నించారు.
బుధవారం ఉదయం ప్రభుత్వ ఆసుపత్రిలో పీఎస్ఆర్ కు వైద్య పరీక్షల నిర్వహించి.. సీఐడీ కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానం ఆంజనేయులుకు 14 రోజుల రిమాండ్ విధించింది. అయితే విజయవాడ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న ఆంజనేయులను ను కస్టడీకి ఇవ్వాలంటూ సీఐడీ అధికారులు కోర్టును ఆశ్రయించగా.. మూడు రోజుల కస్టడీకి కోర్టు ఆనుమతిచ్చింది.
కోర్టు అనుమతితో సీఐడీ అధికారులు ఆదివారం ఉదయం విజయవాడ జైలుకు వెళ్లి పీఎస్ఆర్ ను కస్టడీలోకి తీసుకున్నారు. కానీ ఆఖరి నిమిషంలో ట్విస్ట్ చోటుచేసుకుంది. ఎటువంటి విచారణ జరపకుండానే పీఎస్ఆర్ ను అధికారులు తిరిగి జైలు పంపారు. ఆంజనేయులు ఇవాళ ఉదయం అస్వస్థతకు గురయ్యారు. దీంతో సీఐడీ అధికారులు ఆయన్ను విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. పరీక్షించిన వైద్యులు ఆయన హైబీపీతో బాధపడుతున్నారని తేల్చారు. నిజానికి ఈ రోజు ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు పీసీఆర్ ఆంజనేయులును విచారించాల్సి ఉంది. కానీ ఆయన హైబీపీతో ఇబ్బందిపడుతున్న నేపథ్యంలో సీఐడీ అధికారులు విచారణ వాయిదా వేసి.. పీఎస్ఆర్ ను తిరిగి జైలుకు పంపారు.
The post కస్టడీలో ట్విస్ట్.. పీఎస్ఆర్ ఆంజనేయులుకు అస్వస్థత! first appeared on namasteandhra.