PRAKSHALANA

Best Informative Web Channel

PRAKSHALANA

కార్ల బిజినెస్‌లోకి రిలయన్స్‌! ఎంజీ మోటార్స్‌తో చర్చలు?

[ad_1]

Reliance – MG Motors: 

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ కార్ల వ్యాపారంలోకి అడుగు పెట్టనుందా! ఆ దిశగా చర్చలు జరుగుతున్నాయా? అంటే అవుననే తెలుస్తోంది! అన్ని సవ్యంగా కుదిరితే ఎంజీ మోటార్స్‌లో వాటా కొనుగోలు చేయొచ్చని సమాచారం!

చైనీస్‌ ఆటో కంపెనీ ఎస్‌ఏఐసీకి చెందిన ఎంజీ మోటార్స్‌ తన వ్యాపారంలో మెజారిటీ వాటాను విక్రయించేందుకు ప్రయత్నిస్తోంది. ఈక్విటీ వాటాలను అమ్మేందుకు కొన్ని కంపెనీలతో చర్చలు జరుపుతోంది. ఇందులో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, హీరో గ్రూప్‌, ప్రేమ్‌జీ ఇన్వెస్ట్‌, జేఎస్‌డబ్ల్యూ గ్రూప్‌ ఉన్నాయని టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా గురువారం రిపోర్ట్‌ చేసింది.

‘భారత కంపెనీలతో చర్చలు విస్తృతంగా సాగుతున్నాయి. ఈ ఏడాది చివరి వరకు ఒప్పంద ప్రక్రియను ముగించాలని ఎంజీ మోటార్స్‌ దృఢ నిశ్చయంతో ఉంది’ అని ఒకరు తెలిపారు. దేశంలో తర్వాతి దశ విస్తరణకు ఎంజీ మోటార్స్‌కు నిధులు అత్యంత అవసరమని పేర్కొన్నారు. మంచి విలువకు ఈక్విటీని విక్రయించేందుకు ప్రయత్నిస్తోందని వెల్లడించారు.

చైనాతో అనుబంధం ఉన్న కంపెనీల పెట్టుబడులు, విస్తరణకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం అంత సులభంగా అనుమతులు ఇవ్వడం లేదు. భారత్‌-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తకర పరిస్థితులు ఉండటమే ఇందుకు కారణం. తమ మాతృ సంస్థ నుంచి నిధుల సేకరణ కోసం ఎంజీ మోటార్స్‌ రెండేళ్లుగా ప్రభుత్వ ఆమోదం కోసం ఎదురు చూస్తోంది. కొంత మేర విజయం సాధించినా నిధుల కోసం మిగిలిన అవకాశాలను పరిశీలిస్తోంది.

ఎంజీ మోటార్స్‌ ఇండియా కార్యకలాపాలను భారతీయీకరణ చేయాలన్నదే తమ ధ్యేయమని కంపెనీ సీఈవో రాజీవ్‌ చాబా అన్నారు. అందుకే ఆర్థిక సంస్థలు, భాగస్వాములు, హై నెట్‌వర్త్‌ వ్యక్తులకు మెజారిటీ స్టేక్‌ విక్రయించేందుకు చూస్తున్నామని తెలిపారు. రెండు నుంచి నాలుగేళ్లలో షేర్‌ హోల్డింగ్‌, కంపెనీ బోర్డు, మేనేజ్‌మెంట్‌, సప్లై చైన్‌ను భారతీయీకరణ చేస్తామని వెల్లడించారు.

భారత వ్యక్తులు, కంపెనీలకు వాటాను అమ్మడం ద్వారా రాబోయే 2-4 ఏళ్లలో రూ.5000 కోట్ల మేర నిధులు సేకరించేందుకు ఎంజీ మోటార్స్‌ ఇండియా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ప్రస్తుతం గుజరాత్‌లోని హలోల్‌లో కార్లను తయారు చేస్తోంది. ఇందుకోసం జనరల్‌ మోటార్స్ ప్లాంట్‌ను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఇక్కడ ఏడాదికి 1.2 లక్షల కార్లను ఉత్పత్తి చేయొచ్చు. ఇక్కడే రెండో ప్లాంట్‌నూ విస్తరించనుంది. దాంతో ఏడాదికి మూడు లక్షల యూనిట్లను ఉత్పత్తి చేయనుంది.

రాబోయే కాలంలో 4-5 కొత్త మోడల్స్‌ను విడుదల చేస్తామని ఎంజీ మోటార్స్‌ తెలిపింది. ప్రధానంగా ఎలక్ట్రిక్‌ వెహికిల్స్‌పై ఫోకస్‌ చేశామని వెల్లడించింది. దేశంలోని మొత్తం విక్రయాల్లో 65-75 శాతం వాటా ఈవీ సెగ్మెంట్‌ నుంచే ఉంటుందని విశ్వాసంతో ఉంది. ఇతరులతో కలిసి సెల్‌ తయారీ, హైడ్రోజన్‌ ఫ్యూయెల్‌ సెల్‌ టెక్నాలజీని తయారు చేసేందుకు చూస్తున్నామంది. విస్తరణ ద్వారా 2028 కల్లా 20,000 మందికి ఉపాధి అందించాలన్న లక్ష్యంతో ఉంది.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని ‘abp దేశం’ చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

[ad_2]

Source link

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *