వైసీపీ వైఫల్యాల కారణంగానే ఇక్కడ ఛైర్ పర్సన్ పీఠం చేజారిందంటూ జిల్లా రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది.

TDP – YCP
Updated On : April 25, 2025 / 9:31 PM IST
వైసీపీలో అంతర్గత కలహాలు, అక్కడి ఎమ్మెల్యే దూకుడుకు…వైసీపీ కోట పేకగోడల్లా కూలిపోయింది. నిన్నటి వరకు తిరుగులేని ఆధిక్యంతో ఉన్న మున్సిపల్ పీఠాన్ని అక్కడి ఎమ్మెల్యే సునాయసంగా కదిలించేశాడు. చేజారుతున్న పీఠాన్ని కాపాడుకునేందుకు వైసీపీ నుంచి చేసిన ప్రయత్నాలు..కనీస ఫలితాన్ని కూడా ఇవ్వలేదట.
తమ పార్టీకి చెందిన ఇద్దరు కౌన్సిలర్లను అవిశ్వాస తీర్మాణానికి గైర్హజయ్యేలా చేసున్నా ఆ మున్సిపల్ పీఠం దక్కేదట. అసలెందుకు అక్కడ వైసీపీ అంత బలహీంగా ఉంది? టీడీపీ ఎమ్మెల్యే దూకుడుని ఎందుకు తట్టుకోలేకపోతోంది? మున్సిపల్ పీఠం చేజార్చుకోవడానికి కారణాలేంటి..?
ఏపీలో ఉన్న మున్సిపల్ పీఠాలన్నీ ఒక్కొక్కటిగా కదిలిపోతూ కూటమిఖాతాలో చేరిపోతున్నాయి. అలా వైసీపీ మున్సిపల్ పీఠాలను చేతులారా చేజార్చుకుంటోంది. అధికారం ఉన్నప్పుడు స్థానిక సంస్థల్లో గెలవడం ఈజీనే అనుకున్న వైసీపీకి..అధికారంలో కోల్పోయిన తర్వాత వాటిని నిలబెట్టుకోవడం కష్టమవుతుందట. రాష్ట్రంలో వరుసగా మున్సిపాల్టీలను చేజార్జుకుంటున్న వైసీపీ..తాజాగా శ్రీసత్యసాయి జిల్లా కదిరి మున్సిపాల్టిని కూడా చేజార్చుకుంది.
నిన్నటి వరకు ఇక్కడ తిరుగులేని ఆధిక్యంతో ఉన్న మున్సిపల్ ఛైర్ పర్సన్ నజీమున్నీసా..ఇప్పుడు మాజీ మున్సిపల్ ఛైర్ పర్సన్ అయ్యారు. భారీ ఆధిక్యం ఉండి కూడా…వైసీపీ బలహీనతలు, ప్రస్తుతం అక్కడున్న ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్ దూకుడు కలగలిపి. కొంపముంచిందన్న టాక్ జిల్లా రాజకీయవర్గాల్లో విన్పిస్తోంది.
కదిరి మున్సిపాల్టీలో 36 మంది కౌన్సిలర్లు ఉన్నారు. ఇందులో వైసిపి 31 స్థానాల్లో గెలవగా, టిడిపి 5 స్థానాల్లో విజయం సాధించింది. సార్వత్రిక ఎన్నికల ముందే వైసిపికి చెందిన ఐదుగురు, ఒక ఇండిపెండెంట్ కౌన్సిలర్ టిడిపి గూటికి చేరారు. దీంతో మున్సిపల్ కౌన్సిల్లో టిడిపి బలం 11కి పెరిగింది. వైసిపికి 25 మంది మద్దతు ఉండగా వీరిలో 14మంది తిరుగుబాటు జెండా ఎగురవేశారు.
దీనికి ప్రధానమైన కారణంగా ఛైర్ పర్సన్ నజీమున్నీసా, ఆమె భర్త వ్యవహార తీరే అని అంతా అనుకుంటున్నారట. ఛైర్ పర్సన్ అభివృద్ధి గురించి పట్టించుకోవడం లేదంటూ సొంత పార్టీ కౌన్సిలర్లే అనేకసార్లు బహిరంగ విమర్శలు చేశారట. సార్వత్రిక ఎన్నికల్లో కూటమి అధికారంలోకి రావడంతో ఛైర్ పర్సన్ పై మరింత స్వరాన్ని పెంచారట. అంతే కాకుండా ఆమె రెండున్నరేళ్లకు పదవి నుంచి దిగి మరొకరికి అవకాశం ఇవ్వాల్సి ఉంది. కానీ అలా చేయకపోవడంతో స్వపక్షంలోనే విపక్షం తయారైందట.
ఆయన అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారా?
వైసీపీలో ఇంత గందరగోళ పరిస్థితులు ఉంటే ఇక్కడ సమన్వయకర్తగా ఉన్న మక్బూల్ ఏ మాత్రం పట్టించుకోలేదట. ఆయనపై కొన్ని భూ వివాదాలు ఉండడంతో కేసులు కూడా నమోదు కావడంతో అప్పటినుంచి అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారట. సరిగ్గా వైసీపీకి ఉన్న ఈ మైనస్సే కూటమికి బాగా కలిసొచ్చిందట. తెర వెనుక ఎమ్మెల్యే కందికుంటే ఈ మొత్తం వ్యవహారాన్ని నడిపించారట.
కౌన్సిలర్లను క్యాంపుకు తరలించి..పక్కా వ్యూహంతో కథ నడిపించి..చివరకు ఛైర్ పర్సన్ ను దించి వేశారట. మొత్తం 25 మంది కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మాణానికి హాజరుకాగా..వైసీపీ చైర్ పర్సన్ పక్షాన నిలబడిన 11 మంది గైర్హాజరయ్యారు. 25 మంది ఛైర్ పర్సన్ కు వ్యతిరేకంగా ఓటు వేయడంతో ఆమె పదవి నుంచి కోల్పోయారు. అయితే త్వరలోనే మున్సిపల్ చైర్ పర్సన్, వైస్ చైర్మన్ ఎన్నిక జరగనుంది. వీటిని కూడా కైవసం చేసుకునేందుకు కూటమి పావులు కదుపుతోందట.
వైసీపీ వైఫల్యాల కారణంగానే ఇక్కడ ఛైర్ పర్సన్ పీఠం చేజారిందంటూ జిల్లా రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. ఎమ్మెల్యే కందికుంట లాంటి బలమైన నేత వేస్తున్న వ్యూహాలు చూసైనా వైసీపీ అధిష్టానం జోక్యం చేసుకొని ఉంటే బాగుండేదన్న టాక్ విన్పిస్తోంది. ఏది ఏమైనా వైసీపీ నుంచి మరో మున్సిపాల్టీ చేజారిపోయింది.
ఇప్పటికే రాష్ట్రావ్యాప్తంగా మెజార్టీ మున్సిపాలిటీలను తన ఖాతాలో వేసుకున్న కూటమి…రాబోయే రోజుల్లో మిగిలిన మున్సిపల్ పీఠాలను కూడా తన ఖాతాలో కలిపేసుకునేందుకు ఇప్పటినుంచే ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ రాజకీయ వ్యూహాలకు పదును పెడుతోందట. మరి మిగిలిన మున్సిపల్ పీఠాలనైనా వైసీపీ కాపాడుకుంటుందా లేక వాటిని కూడా కూటమికి అప్పనంగా అప్పగించేస్తుందా అనేది చూడాలి.