పహల్గాం ఉగ్రదాడులకు బదులు తీర్చుకునే క్రమంలో ఆపరేషన్ సిందూర్ తో బలమైన సందేశాన్ని ఇచ్చింది భారత్. అయితే.. ఈ మెరుపుదాడులకు సంబంధించిన అంశాల్ని జాగ్రత్తగా గమనిస్తే.. కొన్ని ఆసక్తికర అంశాలు కనిపిస్తాయి. అన్నింటికి మించి.. పక్కా ప్లానింగ్ తో ఆపరేషన్ సిందూర్ నిర్వహించినట్లుగా కనిపిస్తుంది. అంతేకాదు.. భారతదేశం ఎంత బాధ్యతాయుతమైన దేశమన్న విషయాన్ని అంతర్జాతీయ సమాజానికి మరోసారి చాటి చెప్పే ప్రయత్నం చేసింది.
ఆపరేషన్ సిందూర్ లో భాగంగా తమ ప్రజల ప్రాణాలు తీసినట్లుగా పాకిస్థాన్ ఆరోపించినప్పటికీ.. వాస్తవాలు అందుకు భిన్నంగా ఉన్నాయనే చెప్పాలి. ఎందుకంటే.. భారత్ నిర్వహించిన మెరుపుదాడులు అంతర్జాతీయ సరిహద్దు నుంచి వంద కిలోమీటర్ల పరిధిలోనే నిర్వహించిన విషయాన్ని మర్చిపోకూడదు. ఇందులో ఎక్కువగా పాక్ అక్రమిత కశ్మీర్ తో పాటు.. పాక్ భూభాగంలోని ఉగ్రస్థావరాలపైనే ఎక్కువగా ఫోకస్ చేసింది. మొత్తం తొమ్మిది ప్రాంతాల్లో తాను దాడులు నిర్వహించినట్లుగా భారత్ పేర్కొంది.
ఈ తొమ్మిది ప్రాంతాల్ని చూసినప్పుడు..
1. మర్కజ్ సుభాన్ అల్లా, బహవల్పూర్
2. మర్కజ్ తైబా, మురిద్కే
3. సర్జల్, తెహ్రా కలాన్
4. మెహమూనా జోయా, సియాల్ కోట్
5. మర్కజ్ అహ్లే హదీస్, బర్నాలా
6. మర్కజ్ అబ్బాస్, కోట్లి
7. మస్కర్ రహీల్ షాహిద్, కోట్లి
8. షావాయి నల్లా క్యాంప్, ముజఫరాబాద్
9. సయ్యద్నా బిలాల్ క్యాంప్, ముజఫరాబాద్
ఉగ్రస్థావరాల మీద భారత సైన్యం నిర్వహించిన దాడులకు సంబంధించిన 9 ప్రాంతాల్లో పాక్ అక్రమిత కశ్మీర్ లో ఐదు ప్రాంతాలు ఉంటే.. మరో నాలుగు ప్రాంతాలు పాకిస్థాన్ లో భాగమైనవి. ఈ దాడుల్లో మొత్తం 80 మంది వరకు ఉగ్రవాదులు మరణించినట్లుగా భారత్ చెబుతోంది. ఇందులో బహ్వల్ పూర్ లోనే 30 మంది ఉగ్రవాదులు హతమైనట్లుగా తెలుస్తోంది. మరోవైపు పాకిస్తాన్ విషయానికి వస్తే.. తమ భూభాగంలోని ఆరుచోట్ల దాడులు జరిగాయని.. ఎనిమిది మంది మరణించినట్లుగా పాక్ చెబుతోంది. తన తాజా దాడిలో రాఫెల్ యుద్ద విమానాలతో మిస్సైల్స్ భారత్ ఉపయోగించింది.
తాను చేపట్టిన మెరుపుదాడులు మొత్తం ఉగ్రస్థావరాలు.. ఉగ్రవాదులు మాత్రమే తప్పించి.. ఇంకేమీ కాదన్న విషయాన్ని భారత్ తన తాజా చర్యలతో స్పష్టం చేసిందని చెప్పాలి. నిజానికి పాక్ మీద దాడి చేయటం.. దాన్ని దెబ్బ తీయటమే లక్ష్యమైతే.. మరింత ముందుకు వెళ్లి దాడులకు పాల్పడేది. అలాంటిదేమీ లేకుండా కేవలం వంద కిలోమీటర్ల పరిధిలోనే దాడులు జరగటం చూసినప్పుడు.. ఉగ్రస్థావరాల్ని దెబ్బ తీయటం ద్వారా పహల్గాం ఉగ్రదాడికి భారత్ బదులు తీర్చుకుందని చెప్పాలి.
The post పక్కా ప్లాన్: 100కి.మీ. లక్ష్యంగా ఆపరేషన్ సిందూర్! first appeared on namasteandhra.