ఎట్టకేలకు వైసీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి జగన్ ప్రజల్లోకి రాబోతున్నారా..? మళ్లీ ఆయన పాదయాత్రకు రెడీ అవుతున్నారా..? అందుకు ముహూర్తం ఫిక్స్ అయ్యిందా..? అంటే అవునన్న సమాధానమే వినిపిస్తోంది. తాజాగా తాడేపల్లిలో పార్లమెంట్ నియోజకవర్గాల పరిశీలకులు, కోఆర్డినేటర్లతో జగన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2029 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఏర్పడిందని.. ఓటు అనే ఆయుధంతో ప్రజలే వారికి బుద్ధి చెబుతారని జగన్ ధీమా వ్యక్తం చేశారు. 2027 లో ప్రజల్లో పాదయాత్ర నిర్వహిస్తానని ఈ సందర్భంగా జగన్ ప్రకటించారు.
2014లో అధికారం చేపట్టిన చంద్రబాబు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని.. ఆ సమయంలో తాను పాదయాత్ర చేసి ప్రజలకు భరోసా కల్పించానని జగన్ గుర్తుచేశారు. ఇప్పుడూ సూపర్ సిక్స్ హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్నారని.. 2027లో పాదయాత్ర చేసి కూటమి ప్రభుత్వ మోసాలను ప్రజల్లోకి తీసుకెళ్తానని జగన్ పేర్కొన్నారు. వచ్చే ఏడాది వైసీపీ ప్లీనరీ ఘనంగా నిర్వహిద్దామని.. ప్లీనరీలోనే పాదయాత్రతో పాటు పార్టీ రాజకీయ వ్యూహ నిర్ణయాలను వెల్లడిస్తామని తెలిపారు.
వైసీపీ హయాంలో ప్రతి ఇంటికి పథకాలన్నీ చేర్చిన మన పరిస్థితే ఇలా ఉంటే, ఇచ్చిన హామీలను ఎగొట్టి, రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్న కూటమి ప్రభుత్వం పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు అని జగన్ ఎద్దేవా చేశారు. ప్రస్తుత ప్రభుత్వం ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఏర్పడిందని.. ఆ వ్యతిరేకతను ఏదో విధంగా చూపుతూనే ఉన్నారని జగన్ అన్నారు.
చంద్రబాబు పాలన చూశాక తనలో మార్పు వచ్చిందని.. జగన్ 2.0 ఖచ్చితంగా వేరే విధంగా ఉంటుందని జగన్ తెలిపారు. నాడు ప్రజలకు మంచి చేయాలనే తపనతో కేడర్ కు పట్టించుకోలేదు.. కానీ ఈసారి కార్యకర్తలకే మొదటి ప్రాధాన్యత ఇస్తానని, పార్టీలో కష్టపడే ప్రతి ఒక్కరినీ గొప్ప స్థానంలో కూర్చోబెడతానని జగన్ హామీ ఇచ్చారు. పార్టీ బలోపేతం కోసం శ్రేణులందరూ కష్టపడి పనిచేయాలని జగన్ పిలుపునిచ్చారు.
The post ప్రజల్లోకి జగన్.. పాదయాత్రకు ముహూర్తం ఫిక్స్..! first appeared on namasteandhra.