– తెలంగాణ మహిళా, సాంస్కృతిక, కళా, ప్రజా సంఘాల ప్రతినిధులు హైదరాబాద్లో భారీ ర్యాలీ
నవతెలంగాణ – ముషీరాబాద్
మహిళల వ్యక్తిత్వాన్ని కించపరిచే ప్రపంచ సుందరి పోటీలను వెంటనే రద్దు చేయాలని తెలంగాణ మహిళా, సాంస్కృతిక, కళా, ప్రజా సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేశారు. మిస్ వరల్డ్ అందాల పోటీల వ్యతిరేక వేదిక ఆధ్వర్యంలో శనివారం హైదరాబాద్ బాగ్లింగంపల్లిలోని సుందరయ్య పార్కు నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్డు మీదుగా ఇందిరాపార్కు వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అందాల పోటీలకు వ్యతిరేకంగా నినదించారు. ఈ సందర్భంగా ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి మాట్లాడుతూ.. సనాతన ధర్మ సంస్థాపకులుగా చెప్పుకుంటున్న మోడీ ప్రభుత్వం అందాల పోటీలను నిర్వహించడం అందులో భాగమా? స్త్రీల అంగాంగ ప్రదర్శననే సనాతన ధర్మమా? ఇది భారతదేశ సంస్కృతికి నిదర్శనమా? అని ప్రశ్నించారు. ఈ పోటీలు భారతదేశంలో నిర్వహించడం ఇది మూడోసార న్నారు. రైతుల ఆత్మహత్యలు, లైంగికదాడులు, నిరుద్యోగం లాంటి సమస్యలు ప్రభుత్వాల దృష్టికి రావడం లేదా? అని నిలదీశారు. ఉద్యోగులకు, పెన్షనర్లకు సక్రమంగా వేతనాలు, పెన్షన్లు చెల్లించలేని ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నామని ప్రభుత్వం చెబుతూ ఈ పోటీల కోసం వందల కోట్లు ఖర్చు పెట్టి నిర్వహించడం వెనుక ఉన్న కుట్రను అర్థం చేసుకుని.. రాజకీయ, బహుళజాతి వ్యాపార సంస్థల స్వప్రయోజనాలను తిప్పికొట్టాలంటూ పిలుపునిచ్చారు. తెలంగాణ మహిళ ఆత్మగౌరవ పోరాటానికి స్ఫూర్తి అని, అంగాంగ ప్రదర్శనకు కాదని అన్నారు. అందాల పోటీలు ఉమెన్ ఎంపవర్మెంట్కు సంకేతం కాదని చెప్పారు.
మహిళలను వినియోగదారి వస్తువుగా మారుస్తున్న సామ్రాజ్యవాద విషసంస్కృతిని వ్యతిరేకించాలని, హైదరాబాద్లో జరుగబోయే 72వ ప్రపంచ సుందరి పోటీలకు వ్యతిరేకంగా తెలంగాణ మహిళా, సాంస్కృతిక, కళా, ప్రజా సంఘాల ప్రతినిధులు ముక్త కంఠంతో పిలుపునిచ్చారు. ఈ నిరసన ర్యాలీలో పీఓడబ్ల్యూ జాతీయ నాయకులు సంధ్య, రాష్ట్ర అధ్యక్షులు అనసూయ, చైతన్య మహిళా సంఘం నాయకులు, అరుణోదయ సాంస్కృతిక సమైక్య నాయకులు విమలక్క, ఆల్ ఇండియా మహిళా సాంస్కృతిక సంస్థ నాయకులు హేమలత, పీఓడబ్ల్యూ, ఏఐడీడబ్ల్యూఏ, ఎన్ఎఫ్ఐడబ్ల్యూ, ఏఐఎంఎస్ఎస్, ఏసీఎఫ్, కేఎన్ఎస్, పీవైఎల్, పీడీఎస్యూ, కేఎన్పీఎస్, పీకేఎం, ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, బీఎస్పీ, ఏఐడీవైఓ, హెచ్డబ్ల్యూడబ్ల్యూఎఫ్, బీఎంఎస్, స్త్రీ విముక్తి చైతన్య సంఘం తదితర ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు.