ప్రముఖ నటి అమలా పాల్ గురించి కొత్తగా పరిచయాలు అక్కర్లేదు. సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా చక్రం తిప్పిన ముద్దుగుమ్మల్లో అమలా పాల్ ఒకరు. ప్రధానంగా మలయాళం, తమిళ్ భాషల్లో అమలా పాల్ నటిగా రాణించింది. తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినా టాప్ హీరోలతో జత కట్టి ఇక్కడి వారికి చేరువైంది. ప్రస్తుతం మలయాళంలో వరుస సినిమాలు చేస్తూ వస్తుంది. పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే.. కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే దర్శకుడు ఎ.ఎల్. విజయ్ తో ప్రేమలో పడి పెళ్లి చేసుకుంది. అయితే మూడేళ్లు తిరక్క ముందే వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు.
ఆ తర్వాత చాలా కాలం ఒంటరి జీవితాన్ని గడిపిన అమలా పాల్.. 2023లో వ్యాపారవేత్త జగత్ దేశాయ్ను ప్రేమ వివాహం చేసుకుంది. పెళ్లి సమయానికే అమలా పాల్ ప్రెగ్నెంట్ గా ఉంది. దాంతో మూడు ముళ్ల బంధంలోకి అడుగుపెట్టిన ఎనిమిది నెలలకే ఈ దంపతులు ఓ కుమారుడికి జన్మనిచ్చారు. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే.. అమలా పాల్ ప్రెట్నెంట్ అయ్యాకే ఆమె ఒక నటి అన్న సంగతి జగత్ దేశాయ్ కు తెలిసిందట. తాజాగా ఈ విషయాన్ని అమలా పాల్ స్వయంగా వెల్లడించింది.
గుజరాతీ అయినప్పటికీ జగత్ దేశాయ్ గోవాలో సెటిల్ అయ్యాడు. గోవాలోనే జగత్ ను మీట్ అయింది అమలా పాల్. ఇద్దరి అభిప్రాయాలు కలవడంతో డేటింగ్ ప్రారంభించారు. జగత్ సౌత్ సినిమాలు పెద్దగా చూడరు. అమలా పాల్ కూడా తాను హీరోయిన్ అన్న విషయం అతనికి చెప్పలేదట. కేవలం తన ప్రైవేట్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్నే అతనికి చూపించింది. కొద్ది రోజులు డేటింగ్ చేశాక అమలా పాల్ ప్రెగ్నెంట్ అయింది. దాంతో వెంటనే పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు.

ఇక సహజంగా అవార్డ్ ఫంక్షన్స్ చూసే అలవాటు ఉన్న జగత్.. ఒకరోజు జెఎఫ్డబ్ల్యూ ఈవార్డ్ వేడుకల్లో అమలా పాల్ ను చూశాడట. రెడ్ కార్పెట్ పై అమలా పాల్ నడవటం, ఉత్తమ నటిగా క్రిటిక్స్ అవార్డు అందుకోవడం చూసి జగత్ దేశాయ్ ఒక్కసారిగా షాక్ అయ్యాడట. అమలా పాల్ ప్రెగ్నెంట్ అయ్యాక జరిగిన సంగతిది. అమలా పాల్ ఒక హీరోయిన్ అన్న విషయం జగత్ కు తెలిసింది అప్పుడే. ఇక ఆ తర్వాత అమలా పాల్ గురించి పూర్తిగా సెర్చ్ చేసిన జగత్.. ఆమె నటించిన ఒక్కొక్క సినిమాను చూడటం స్టార్ట్ చేశాడట. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ ఆసక్తికర విషయాన్ని అమలా పాల్ అందరితోనూ పంచుకోవడంతో.. అది కాస్త వైరల్ గా మారింది.