పహల్గామ్లోని బైసరన్ వ్యాలీలో ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రదాడిని భారత ప్రభుత్వం సీరియస్ గా తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఉగ్రదాడి వెనుక పాకిస్థాన్ ఉందని తేలడంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు దారుణంగా దిగజారాయి. పాక్ పై కన్నెర చేసిన భారత ప్రభుత్వం.. ఆ దేశానికి వ్యతిరేకంగా పలు కఠిన చర్యలు చేపడుతోంది. ఆర్థిక, వ్యాపార మార్గాల్లో పాకిస్థాన్పై ఒత్తిడి పెంచడమే లక్ష్యంగా నిర్ణయాలు తీసుకుంటోంది. తాజాగా పాక్ అబ్బా అనేలా భారత్ మరో దెబ్బ కొట్టింది.
పాకిస్థాన్ నుంచి అన్ని రకాల దిగుమతులపై నిషేధం విధిస్తూ భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జాతీయ భద్రత, ప్రజా విధాన ప్రయోజనాల దృష్ట్యా పాకిస్థాన్ నుంచి జరిగే అన్ని రకాల దిగుమతులను నిషేధిస్తున్నట్లు శుక్రవారం కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నిషేధం తక్షణమే అమలులోకి తెచ్చింది. మేడిన్ పాకిస్థాన్ వస్తువులకు ఇకపై ఇండియాలో చోటులేదని కేంద్రం స్పష్టం చేసింది.
పాకిస్థాన్ మూలం ఉన్న లేదా అక్కడి నుంచి ఎగుమతి అయిన ఏ వస్తువైనా సరే ఇండియాలోకి అనుమతించబోమని.. ప్రస్తుతం రవాణా మార్గంలో ఉన్న ఉత్పత్తులకు కూడా ఈ నిషేధం వర్తిస్తుందని వాణిజ్య మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్లో తెలిపింది. కాగా, మహాల్గామ్ ఉగ్రదాడి తర్వాత దాయాది పాకిస్తాన్ పై ప్రతీకారంగా భారత ప్రభుత్వం సింధూ నదీ జలాల ఒప్పందం రద్దు చేసింది. భారత్లో ఉన్న పాక్ పౌరులు తిరిగి పంపించింది. అలాగే పాకిస్థాన్ దేశానికి చెందిన విమానాలు మన గగనతలంలోకి రాకుండా చర్యలు చేపట్టింది. తాజాగా మేడిన్ పాక్ వస్తువులకు భారత్ నో ఎంట్రీ బోర్డు పెట్టేసింది. ఈ నిషేధంతో పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థపై గణనీయమైన ప్రభావం పడే అవకాశముందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
The post భారత్ దెబ్బకు అబ్బా అంటున్న పాక్..! first appeared on namasteandhra.