– నాలుగు రోజులు గడిచినా ముగియని ఆపరేషన్
– మీడియా చూపంతా కర్రెగుట్టల వైపే
నవతెలంగాణ-చర్ల
అటు ఛత్తీస్గఢ్-మహారాష్ట్ర, ఇటు తెలంగాణ సరిహద్దులో సుమారు 250 కిలోమీటర్ల మేర వ్యాపించి ఉన్న కర్రెగుట్టల నుంచి మావోయిస్టులను ఖాళీ చేయించాలనే ఉద్దేశంతో పోలీసులు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు. నాలుగు రోజులుగా కూంబింగ్ చేస్తున్నారు. దాంతో దండకారణ్యం భీతిల్లుతోంది. కర్రెగుట్టల నుంచి మావోయిస్టులను తరిమికొట్టేందుకు పోలీసులు చేస్తున్న సాహసంలో కొంతమంది జవాన్లు సొమ్మసిల్లి వైద్య సేవలు ఆందుకోవాలసిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటి వరకు భద్రతా దళాలు చేపట్టిన ఆపరేషన్లలో ఇదే పెద్దది. ఈ ఆపరేషన్లో దాదాపు 5 వేల మంది సైనికులు పాల్గొంటున్నారు. హిడ్మా, దామోదర్, దేవా వారి బెటాలియన్లతో సహా అనేక మంది హై క్యాడర్ మావోయిస్టులు తలదాచుకున్నారన్న విశ్వసనీయ సమాచారంతో భద్రతాబలగాలు కర్రెగుట్టలను నాలుగు వైపులా చుట్టుముట్టడంతో అక్కడ యుద్ధ వాతావరణం నెలకొంది. దాంతో ఆ అటవీ ప్రాంతంలో నివసించే ఆదివాసీయులు హడలెత్తిపోతున్నారు.
దాదాపు 300 మంది మావోయిస్టులు ఉన్నట్టు సమాచారంతో కర్రెగట్ట, నాడ్పల్లి, పూజారి కాంకేర్ కొండల్లో ఈ ఆపరేషన్ జరుగుతోంది. రెండు వైపుల నుంచి అడపాదడపా కాల్పులు జరుగుతున్నాయి. ఇంటిలిజెన్సీ సమాచారం ప్రకారం.. మావోయిస్టుల వద్ద తగినంత తిండి లేకపోవచ్చని తెలుస్తున్నది. అవసరమైన తాగునీరు సమృద్ధిగా లేకపోవడం వల్ల మావోయిస్టులు చిక్కుల్లో పడతారని పలువురు విశ్లేషిస్తున్నారు. మూడు రాష్ట్రాల దళాలు పర్వతాన్ని అన్ని వైపుల నుంచి చుట్టుముట్టాయి. మావోయిస్టు పీఎల్జీఏ బెటాలియన్ 1, 2 ఇతర కంపెనీలు కర్రెగుట్టలపై చురుకుగా ఉన్నట్టు తెలుస్తుంది.
ఆపరేషన్ పరేషాన్
ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం, మహారాష్ట్ర నుంచి సీ-60 కమాండోలు, ఛత్తీస్గఢ్ నుంచి వేలాది మంది డీఆర్జీ సిబ్బంది దాదాపు ఒక వారం పాటు లాజిస్టిక్స్ సామగ్రితో ఆపరేషన్లో ఉన్నారు. అయితే సామగ్రి అయిపోగానే భద్రతదళాలకు తిరిగి సామగ్రి సమకూరుతుంది.. కానీ మావోయిస్టులకు ఆ పరిస్థితి లేదు. మావోయిస్టు కమాండర్ హిడ్మా దేవా స్వస్థలమైన పూర్వర్తి దాటి భద్రతా దళాలు రారుగూడెం వరకు శిబిరాలను ఏర్పాటు చేశాయి. మరోవైపు, మావోయిస్టులు తెలంగాణలోని ములుగు జిల్లా వెంకటాపురం నుంచి కూడా తమ అవసరాలను తీర్చుకుంటున్నట్టు తెలిసింది. కానీ పోలీస్ దళం వారి సరఫరా గొలుసును విచ్ఛిన్నం చేసింది.
పోలీసుల ముందున్న సవాలు
కర్రెగుట్టల ప్రాంతంలో వివిధ రకాల కొండలున్నాయి. ఇక్కడి భౌగోళిక పరిస్థితుల గురించి మావోయిస్టులకు బాగా తెలుసు. మావోయిస్టుల స్థావరాన్ని చేరుకోవడంలో కర్రెగుట్టలు ఎక్కడంలో భద్రతా దళం పెను సవాళ్లను ఎదుర్కొంటుంది. కర్రెగట్టలపై మావోయిస్టులు స్థావరాలైన బంకర్లను కనిపెట్టేందుకు భద్రత దళానికి చెందిన 2-3 హెలికాప్టర్లు గుట్టల గగనతలంలో తిరుగుతున్నాయి. మావోయిస్టులు ఇక్కడ దాక్కోవడానికి పదుల సంఖ్యలో బంకర్లను నిర్మించారు. వారి వద్ద భారీ మొత్తంలో ఆయుధాలు, మందుగుండు సామగ్రి ఉన్నాయి.
గ్రామస్తులు హడల్
నాలుగు రోజులుగా కాల్పుల శబ్దం వినిపిస్తోందని ఆ ప్రాంత ఆదివాసీ గ్రామస్తులు చెబుతున్నారు. భద్రతా దళాలు ఇంటి నుంచి బయటకు రావొద్దని, అటవీ ప్రాంతంలోకి వెళ్ళవద్దని హెచ్చరికలు జారీ చేశారని తెలిపారు. హెలికాప్టర్ల ప్రదక్షిణలు, బాంబు పేలుళ్ల శబ్దాలతో దండకారణ్యం అంతా బీతిరిల్లిపోతోంది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక అక్కడ నివసిస్తున్న గ్రామస్తులు బిక్కుబిక్కుమంటున్నారు.