ఏపీ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. వెంటిలేటర్పై నుంచి వికసిత ఏపీ దిశగా రాష్ట్రం అడుగులు వేస్తోందన్నారు. వచ్చే రెండేళ్లలో రాష్ట్రం పరుగులు పెడుతుందని తెలిపారు. రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనుల ప్రారంభం సందర్భంగా ప్రసంగిం చిన చంద్రబాబు.. రాష్ట్రానికి దశ-దిశ అమరావతితోనే ఏర్పడనుందని తెలిపారు. ఈ క్రమంలో ప్రధాని మోడీ సహకారంతో తాము మరింత ముందుకు సాగుతామన్నారు. గత ఐదేళ్లలో రాష్ట్రం అన్యాయం అయిపోయిందన్న ఆయన.. అన్ని వ్యవస్థలు కూడా నిర్వీర్యం అయిపోయాయని చెప్పారు. వైసీపీ పాలన పేరు ఎత్తకుండానే నిప్పులు చెరిగారు.
నాశనమైన వ్యవస్థలను గాడిలో పెట్టేందుకు తమకు ఎక్కువ సమయం పట్టిందన్న చంద్రబాబు.. ఈ క్రమంలో తమకు.. మోడీనే ఆక్సిజన్ అందించారని తెలిపారు. ఇప్పుడు రికవరీ దిశగా పుంజుకున్నట్టు తెలిపారు. అయితే.. ఇంకా సమస్యలు తొలిగి పోలేదని.. బలమైన ఆర్థిక వ్యవస్థగా రూపు దాల్చేందుకు ఏపీకి మరింత సమయం పడుతుందని చెప్పారు. అయితే.. ఏపీని అన్ని విధాలా అభివృద్ది చేసేందుకు తాము నిరంతరం ప్రయత్నం చేస్తున్నామని చంద్రబాబు తెలిపారు. దీనికి ప్రధాని సహకారం రాష్ట్రానికి చాలా అవసరమని ఆయనను చూస్తూ.. చెప్పారు. దీనికి మోడీ నవ్వుతూ స్వాగతించారు.
మోడీపై పొగడ్తలు!
ప్రధాని నరేంద్ర మోడీపై సీఎం చంద్రబాబు పొగడ్తల వర్షం కురిపించారు. సరైన సమయంలో.. సరైన నేత దేశాన్ని పాలిస్తున్నారని చెప్పారు. విశ్వగురుగా మోడీ పేరు తెచ్చుకున్నారని.. ఇకప్పుడు ప్రపచం స్థాయిలో భారత్ దిగువన ఉండేదని.. మోడీ సారథ్యంలో దేశం ఐదో స్థానానికి ఎదిగిందని పేర్కొన్నారు. వికసిత భారత్ 2047 లక్ష్య సాధనకు తామంతా కృషి చేస్తున్నామని చెప్పారు. `కులగణన` విషయంలో మోడీ ప్రబుత్వం తీసుకున్న నిర్ణయం సంచలనాత్మకమని చంద్రబాబు తెలిపారు. దీనిని తాము స్వాగతిస్తున్నామని చెప్పారు.
The post మోదీ చేతుల మీదుగానే అమరావతి ప్రారంభిస్తా: చంద్రబాబు first appeared on namasteandhra.