క్రిమినల్స్తో రాజకీయ నేతలకు సాన్నిహిత్యం ఉంటే ఏమవుతుందో రౌడీషీటర్ బోరుగడ్డ అనిల్కుమార్ ఉదంతమే నిదర్శనం. జగన్ ఐదేళ్ల హయాంలో రెచ్చిపోయున ఈ రౌడీషీటర్.. ఆయన ఓడిపోయిన తర్వాత కూడా ఏకంగా వ్యవస్థలతోనే చెలగాటమాటడడం విస్మయపరుస్తోంది. తప్పుడు మెడికల్ సర్టిఫికెట్తో హైకోర్టునే బురిడీ కొట్టించి బెయిలు తెచ్చుకోవడం నిర్ఘాంతపరుస్తోంది. పరారయ్యేందుకు వేసిన పథకం పారకపోవడంతో వెంటనే జైల్లో లొంగిపోవడం కూడా విచిత్రంగానే ఉంది.
జగన్ దన్నుతో ఆ ఐదేళ్లలో రాజ్యాంగేతర శక్తిగా చెలరేగిన బోరుగడ్డ.. బెదిరింపులు, డబ్బు వసూళ్లకు పాల్పడడమే గాక చంద్రబాబు, లోకేశ్, పవన్ కల్యాణ్పై సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టాడు. బహిరంగంగా మీడియా ముందు వారిని, మాజీ ఎంపీ రఘురామరాజు, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డిని, వారి కుటుంబ సభ్యులను దూషించాడు. అతడిపై రాష్ట్రవ్యాప్తంగా సుమారు 14 కేసులు నమోదయ్యాయి.

గుంటూరులోని ఏఈఎల్సీ చర్చి ట్రెజరర్ బాబు ప్రకాశ్ను కత్తితో బెదిరించి హత్యాయత్నానికి పాల్పడిన కేసులో బోరుగడ్డను గత ఏడాది అక్టోబరు 16వ తేదీ రాత్రి లో అరండల్పేట పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత వివిధ పోలీసు స్టేషన్లలో నమోదైన కేసుల్లో ఆయా పోలీసులు పీటీ వారెంట్లపై సంబంధిత కోర్టుల్లో హాజరుపరిచారు. తాను కేంద్ర మంత్రి పీఏనంటూ అనంతపురం కలెక్టర్, ఎస్పీకి ఫోన్ చేసి అక్కడి చర్చి ఆస్తుల వివాదంలో బోరుగడ్డ తలదూర్చాడు. దీంతో అనంతపురం నాలుగో పట్టణ పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. మిగతా కేసుల్లో అతడికి బెయిల్ వచ్చినప్పటికీ.. ఈ కేసులోనే రిమాండ్పై రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నాడు.
అయితే తన తల్లి పద్మావతికి ఊపిరితిత్తులు, గుండె సంబంఽధిత సమస్యలున్నందున.. ఆమెకు చికిత్స చేయించాలంటూ బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించాడు. కొడుకు ఎలాంటి వాడైనా.. తల్లి బాగోగులు చూసుకోవలసిందే. కోర్టు ఈ మానవీయ కోణంలో పరిశీలించి.. ఈ ఏడాది ఫిబ్రవరి 14 నుంచి 28 వరకు మధ్యంతర బెయిలు మంజూరు చేసింది. బోరుగడ్డ తల్లికి అనారోగ్యం నిజం.. ఆమెకు చెన్నై అపోలోలో శస్త్ర చికిత్స జరగడమూ నిజం. అయితే… బోరుగడ్డకు బెయిలు రావడానికి రెండు రోజుల ముందే.. అంటే గతనెల 12వ తేదీనే ఆమె ఆస్పత్రిలో చేరారు. 18న ఆమెకు శస్త్రచికిత్స జరిగింది. 23వ తేదీన డిశ్చార్జి అయ్యారు.
బోరుగడ్డ 28వ తేదీ వరకు బెయిలుపైనే ఉన్నాడు. కానీ చెన్నైకి వెళ్లనే లేదు. ఫిబ్రవరి 28న రాజమండ్రి సెంట్రల్ జైలులో లొంగిపోయాడు. అయితే మధ్యంతర బెయిల్ను పొడిగించాలని మర్నాడే మళ్లీ హైకోర్టును ఆశ్రయించాడు. తన తల్లికి శస్త్రచికిత్స జరిగినందున కొన్నాళ్లపాటు ఆమె బాగోగులు చూసుకోవాలని నిజాయితీగా కోరితే సరిపోయేది! కానీ తప్పుడు మార్గం ఎంచుకున్నాడు. ఫిబ్రవరి 23నే ఆమె డిశ్చార్జి అయినప్పటికీ… ‘ఆమె ఇంకా చెన్నై అపోలోలో చికిత్స పొందుతున్నారు’ అని పిటిషన్లో పేర్కొన్నాడు. అంతేకాదు… ‘ఆమె పరిస్థితి క్షీణిస్తోంది. అత్యవసరంగా ఆమెను చెన్నై అపోలో ఆస్పత్రిలో అడ్మిట్ చేసి చికిత్స అందించాలి’ అంటూ గుంటూరు లలితా హాస్పిటల్ చీఫ్ కార్డియాలజిస్ట్ డాక్టర్ రాఘవ శర్మ ఇచ్చినట్లుగా ఒక నకిలీ మెడికల్ సర్టిఫికెట్ను కోర్టు ముందుంచాడు.
అది నిజమైన సర్టిఫికెట్ అవునో కాదో తనకు తెలియదని ఏపీపీ కోర్టుకు చెప్పారు. అయితే… కుమారుడిగా తల్లి బాగోగులను చూసుకోవాల్సిన అవసరాన్ని మానవీయ కోణంలో చూసిన హైకోర్టు.. మధ్యంతర బెయిల్ను మార్చి 11 వరకు పొడిగించింది. సర్టిఫికెట్ నకిలీదని తేలితే చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది.
అలా వదిలేస్తారా?
హైకోర్టు బెయిలు ఇచ్చిన తర్వాత.. రిమాండ్ ఖైదీని విడుదల చేయడానికి కొన్ని నిబంధనలు పాటించాలి. బెయిలు విషయాన్ని జైలు సూపరింటెండెంట్ తనపై అధికారులకు తెలియజేయాలి. అలాగే… ఆ కేసు నమోదైన పోలీసు స్టేషన్కు కూడా సమాచారం పంపించాలి. బోరుగడ్డలాంటి వ్యక్తి విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉండగా.. రాజమండ్రి సెంట్రల్ జైలు అధికారులు.. అతడికి హైకోర్టు అలా బెయిలు ఇవ్వగానే, ఇలా గుట్టుగా బయటకు పంపించేశారు. హైకోర్టు మధ్యంతర బెయిలు ఇచ్చి, రెండోసారి దానిని పొడిగించినప్పటికీ ఈ విషయం ప్రభుత్వం దృష్టికి రాలేదు. బోరుగడ్డ బయటికి వచ్చిన సంగతి మీడియాకు కూడా తెలియదు. అంత రహస్యంగా, భద్రంగా జైలు దాటించేశారన్న మాట.
రంగారెడ్డి.. సంగారెడ్డి పరిసర ప్రాంతాల్లో బోరుగడ్డ కదలికలు
జైలు నుంచి విడుదలయ్యాక బోరుగడ్డ చెన్నై వెళ్లలేదు. తల్లి వద్ద ఉండనే లేదు. తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి , సంగారెడ్డి పరిసర ప్రాంతాల్లో సంచరించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. అతడికి వైసీపీ ముఖ్య నేత సహకరించినట్లు సమాచారం. బోరుగడ్డ తప్పించుకుపోయాడని గుప్పుమనడంతో అతడు ఓ వీడియోను విడుదల చేశాడు. తన హత్యకు చంద్రబాబు ప్రభుత్వం కుట్ర చేస్తోందన్నాడు. నకిలీ సర్టిఫికెట్ సృష్టించలేదని, జైల్లో ఉంటే ఇలాంటి పనిచేయగలనని బుకాయించాడు.
తనకు తల్లయినా, తండ్రయినా జగనేనని.. కోర్టులన్నా, న్యాయవ్యవస్థ అన్నా ఎంతో గౌరవమని చెప్పాడు. అజ్ఞాతంలో ఉన్న బోరుగడ్డ ఈ వీడియోను ఎక్కడ రికార్డు చేశాడు..? ఎవరి ఫోన్ ద్వారా దానిని రికార్డు చేసి ఎవరి ద్వారా బయటకు విడుదల చేశాడనేది పోలీసులు గుర్తించలేకపోయారు.
గుంటూరు పోలీసుల విచారణ..
తల్లి అనారోగ్యంపై బోరుగడ్డ హైకోర్టుకు అందించిన మెడికల్ సర్టిఫికెట్ నిజమైనదో కాదో నిర్ధారించాలని అనంతపురం నాలుగో పట్టణ పోలీసులు.. గుంటూరు పోలీసులను కోరారు. కార్డియాలజిస్టుగా డాక్టర్ రాఘవశర్మకు మంచి పేరుంది. క్లిష్టమైన కేసులకు సైతం గుంటూరులోనే చికిత్స అందించగల సమర్థులు. అలాంటిది… బోరుగడ్డ తల్లిని చెన్నై అపోలో ఆస్పత్రికి తీసుకెళ్లాలని చెప్పారనడంతో గుంటూరు పోలీసులకు అనుమానం వచ్చింది.
స్పెషల్ బ్రాంచ్ పోలీసులు రంగంలోకి దిగడంతో అసలు విషయం బయటపడింది. లలితా ఆస్పత్రిలో బోరుగడ్డ తల్లి అసలు చేరనేలేదు. ఆమెను చెన్నై అపోలోకు రిఫర్ చేస్తూ తానెలాంటి సర్టిఫికెట్ ఇవ్వలేదని డాక్టర్ రాఘవశర్మ స్పష్టంచేశారు. ఆ మెడికల్ సర్టిఫికెట్పై ఉన్న సంతకం తనది కాదని తేల్చిచెప్పారు. ఆయన పేరుతో ఉన్న లెటర్హెడ్పై ఫోర్జరీ సర్టిఫికెట్ సృష్టించారని తేలింది.
ఈ లోపు బోరుగడ్డ పత్తా లేకుండా పోయాడు. గుంటూరు, అనంతపురం పోలీసులు ఎంత ప్రయత్నించినా ఆచూకీ తెలియలేదు. అతడి ఫోన్తో పాటు తల్లి ఫోన్ కూడా స్విచాఫ్ చేసి ఉన్నాయి. కేసులు, అరెస్టులు, కారాగారవాసం నుంచి తప్పించుకుని.. పరారయ్యేందుకే తల్లి అనారోగ్యాన్ని వాడుకుని బెయిల్ కోసం పథకం వేసినట్లు తేలిపోయింది.
విమానంలో వచ్చయినా తక్షణమే లొంగిపోవాలి!
ఇంత వివాదం జరుగుతున్నా.. మళ్లీ బెయిలు పొడిగించాలని బోరుగడ్డ హైకోర్టులో పిటిషన్ వేశాడు. అతడి తీరుతెన్నులను పోలీసులు నివేదించడంతో బెయిలు పొడిగించేందుకు న్యాయస్థానం నిరాకరించింది. చెన్నైలో ఉన్నాడంటున్నారని.. అక్కడి నుంచి విమానంలో వచ్చయినా జైలులో వెంటనే లొంగిపోవలసిందేనని తేల్చిచెప్పింది. మార్చి 11 సాయంత్రం 5 గంటల వరకే గడువు విధించింది. హైకోర్టు ఆగ్రహంతో బోరుగడ్డకు అంతా బోధపడింది. మార్చి 12న ఉదయాన్నే రాజమండ్రి జైల్లో లొంగిపోయాడు.
అంటే.. అతడు అక్కడ గానీ, గుంటూరులో గానీ తలదాచుకున్నట్లు తేలింది. అంతకుముందు బెంగళూరులో కూడా మకాం వేసినట్లు పోలీసులు గుర్తించారు. లొంగిపోయిన బోరుగడ్డను జైలు అధికారులు వివరణ కోరలేదు. ముందురోజే రావలసి ఉన్నా ఎందుకు రాలేదో అడగనేలేదు.
బోరుగడ్డకు అండగా సీనియర్ ఐపీఎస్?
ఈ యావత్ ఉదంతంలో బోరుగడ్డకు ఓ సీనియర్ ఐపీఎస్ అధికారి సహకరించినట్లు తెలుస్తోంది. కూటమి ప్రభుత్వంలోని ఓ కీలక ప్రజాప్రతినిధి కూడా అండగా ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై పోలీసులు కూపీ లాగుతున్నారు. అనంతపురం నాలుగో పట్టణ పోలీసులు నమోదు చేసిన కేసులో కోర్టు జ్యుడీషియల్ రిమాండ్ విధించగా.. తనను అనంతపురం జైలులో కాకుండా రాజమహేంద్రవరం జైలుకు పంపాలని అతడు ఎందుకు కోరాడన్నది పోలీసు వర్గాల్లో చర్చనీయాంశమైంది.
సీనియర్ ఐపీఎస్ సాయంతో రాజమహేంద్రవరం జైలుకు చేరినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. కూటమి ప్రభుత్వంలోని కీలక ప్రజాప్రతినిధికి ఎన్నికల ముందు బోరుగడ్డ కొంత ఫండ్ ఇచ్చాడని.. ఇప్పుడాయన సహాయ సహకారాలు అందిస్తున్నట్లు అతడి అనుచరులు ప్రచారం చేసుకుంటున్నారు.