మ్యాగజైన్ స్టోరీ: ప్రభుత్వం మారినా కన్సల్టెంట్ల పెత్తనమే?

Date:

Share post:


రాష్ట్ర సచివాలయం అంటే.. ప్రధాన కార్యదర్శి, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు, సెక్షన్‌ ఆఫీసర్లు, అసిస్టెంట్‌ సెక్షన్‌ ఆఫీసర్లు! అయితే జగన్‌ జమానాలో వీరిని కాదని.. మరో కొత్త వర్గాన్ని పాదుగొల్పారు. వారే.. కన్సల్టెంట్లు! ‘భగవంతుడికీ-భక్తుడికీ మధ్య’ అన్నట్లుగా… ప్రభుత్వం, కార్యదర్శులు, సెక్షన్‌ ఆఫీసర్ల మధ్య వీరు తయారయ్యారు! అయితే.. వీరిది అనుసంధానం కాదు.. అచ్చంగా అడ్డుగోడ. ఈ కన్సల్టెంట్ల వ్యవహారం సచివాలయంలో అతిపెద్ద చర్చనీయాంశంగా మారింది.

ప్రభుత్వం కన్సల్టెంట్ల సేవలు తీసుకోవడం కొత్తేమీ కాదు! ఎప్పటి నుంచో జరుగుతున్నదే! కానీ కొన్ని ప్రత్యేకమైన ప్రాజెక్టులు, అంతర్జాతీయ స్థాయి ప్రణాళికలు, వినూత్నమైన ఆలోచనల అమలు తదితర సేవలకు మాత్రమే కన్సల్టెంట్లను వినియోగించుకోవడం రివాజు! ఆయా రంగాల్లో నిష్ణాతులైన వారిని అలా నియమించుకుంటే ప్రాజెక్టు నివేదికల తయారీ, సంప్రదింపులు సులువుగా, సాఫీగా సాగుతాయి. అయితే ఐదేళ్లుగా పరిస్థితి ‘అంతకు మించి’ అన్నట్లుగా తయారైంది.

ప్రభుత్వ యంత్రాంగం చేయగలిగే రొటీన్‌ కార్యకలాపాల్లోనూ కన్సల్టెంట్లు వేలు పెడుతున్నారు. సచివాలయంలోని అన్ని శాఖల్లో కలిపి ఏకంగా వంద మందికిపైగా కన్సల్టెంట్లు ఉన్నారు. ఆర్థిక శాఖ, దాని పరిధిలోని ప్రణాళిక శాఖలోనే ఏకంగా 31 మంది ఉండటం గమనార్హం. వీరందరికీ ప్రభుత్వ అధికారులతో సమానంగా, కొందరికి ఇంకా ఎక్కువగానే వేతనాలు అందిస్తున్నారు. వెరసి.. సెక్రటేరియట్‌లో ప్రభుత్వ యంత్రాంగానికి సమాంతరంగా ఒక ప్రైవేటు వ్యవస్థ నడుస్తోంది.

బడ్జెట్‌ రూపకల్పనతో వారికేం పని?

అంతర్జాతీయ ఆర్థిక సంస్థల నిధులతో చేపట్టే ప్రాజెక్టుల అమలుకు కన్సల్టెంట్ల నియామకం తప్పనిసరి. ఆయా నిధుల వినియోగం, నివేదికల రూపకల్పనకు వీరిని నియమిస్తారు. ఒప్పందంలోనే దీని గురించి ఉంటుంది. అంతర్జాతీయ విధానాలకు అనుగుణంగా వినూత్నమైన పాలసీలు రూపొందించేందుకు కన్సల్టెంట్లను నియమించుకోవడంలో తప్పులేదు. కానీ… జగన్‌ ప్రభుత్వం వచ్చాక భారీ స్థాయిలో ‘కన్సల్టెన్సీ రాజ్‌’ తీసుకొచ్చారు. ఇప్పుడు అది మరింత పెరిగింది.

బడ్జెట్‌ రూపకల్పన కోసం ఎవరైనా ఆర్థిక నిపుణుడి సలహా తీసుకోవచ్చు. సలహాదారుగా నియమించవచ్చు. కేంద్రం నుంచి, అంతర్జాతీయ ఆర్థిక సంస్థల నుంచి నిధులు ఎలా సమీకరించవచ్చు. తదితర అంశాలపై సలహాలు ఇచ్చేందుకు కన్సల్టెంట్లను నియమించుకోవడంలో తప్పులేదు. కానీ… ఏటా జరిగే బడ్జెట్‌ రూపకల్పనకూ వీరినే ఆశ్రయిస్తున్నారు. బిల్లులు, చట్టాలను కూడా కన్సల్టెంట్లతో చేయిస్తున్నారు. ప్రస్తుతం 16వ ఆర్థిక సంఘాన్ని అడగాల్సిన నిధుల కోసం ఆర్థిక శాఖలో ఏకంగా 11 మంది కన్సల్టెంట్లు పనిచేస్తున్నారు. వీరిలో ఎక్కువమంది బెంగళూరు, చెన్నై నుంచి వస్తారు. ఎప్పుడు వస్తారో, ఎప్పుడు పోతారో… అంతా వాళ్ల ఇష్టం. జీతాలు మాత్రం లక్షల్లోనే!

ఉద్యోగులను దూరం చేస్తూ…

సచివాలయంలో ఎస్‌వోలు, ఏఎస్‌వోలు అనుభవజ్ఞులు! విషయ పరిజ్ఞానం ఎక్కువ. అయితే కన్సల్టెంట్లకు ఉన్న అర్హత… హైఫై ఇంగ్లీష్‌ వాడడమే! ప్రభుత్వంలో సెక్రటరీల పేరుతో పాలనా వ్యవహారాలు నడుస్తాయి. వారికి సాయం చేయడానికి ప్రభుత్వ ఉద్యోగులు వివిధ కేడర్లలో ఉంటారు. కానీ ఇప్పుడు చాలామంది కార్యదర్శులు కన్సల్టెంట్లు లేకుండా ఒక్క అడుగు కూడా వేయడం లేదు. పోనీ ఆయా సబ్జెక్టుల్లో నైపుణ్యం ఉన్న వారినే నియమించుకుంటున్నారా అంటే అదీ లేదు. కేవలం ప్రపంచ స్థాయి ఇంగ్లీషు వస్తే చాలన్నట్టుగా కన్సల్టెంట్ల నియామకాలు జరుగుతున్నాయి.

వీరికి ప్రత్యేకమైన టాస్క్‌లు కూడా అప్పగించడంలేదు. ముఖ్యమంత్రికి ప్రజెంటేషన్‌ ఇవ్వాలన్నా, నోట్‌ రాయాలన్నా, కేంద్ర ప్రభుత్వ శాఖలకు ప్రతిపాదనలు పంపాలన్నా వీరినే పిలుస్తున్నారు. వీరు కూడా.. సంబంధిత సబ్జెక్టు చూసే సెక్షన్‌ ఆఫీసర్ల దగ్గరకు వెళ్లి వివరాలు తీసుకుని, వాటి ఆధారంగా ప్రజంటేషన్లు, లేఖలు సిద్ధం చేస్తున్నారు. ఈ మాత్రం పని ఎస్‌వోలు, ఏఎస్‌వోలు చేయలేరా? కచ్చితంగా చేయగలరు. అయినప్పటికీ కన్సల్టెంట్లదే పెత్తనం! దీంతో సెక్రటరీలకు, సచివాలయ అధికారులకు మధ్య అంతరం పెరుగుతోంది. కొన్ని శాఖల్లో సెక్రటరీలు, ఉద్యోగులు నెలల తరబడి నేరుగా మాట్లాడుకోకుండానే పాలనా వ్యవహారాలు సాగుతున్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

అనుభవాన్ని పక్కనపెట్టి…

సచివాలయంలో కార్యదర్శులు నిర్ణయం తీసుకునేందుకు ఒక విధానం అమలులో ఉంది. కొందరు కార్యదర్శులు తన కింది స్థాయిలో ఉండే అధికారులను పిలిచి మాట్లాడతారు. మరికొందరు ఆ సెక్షన్‌కు సంబంధించిన ఏఎస్‌వో, ఎస్‌వో, ఏఎస్‌, డీఎస్‌ ఇలా అందరినీ పిలిచి అభిప్రాయాలు తీసుకుని.. ఒక నిర్ణయం తీసుకుంటారు. ఎందుకంటే.. ఆ శాఖలో సెక్రటరీల కంటే ఉద్యోగులకే ఎక్కువ అనుభవం ఉంటుంది.

ఉదాహరణకు… రాష్ట్రంలో పన్ను ఆదాయం ఎలా పెంచాలి.. ఎందుకు తగ్గుతోంది.. ఎక్కడ లోపం జరుగుతోందని ప్రశ్నిస్తే ఆర్థిక శాఖ అధికారులే సాధికారికంగా జవాబు చెప్పగలరు. ఎందుకంటే వారికి బదిలీలు ఉండవు. రిటైరయ్యే వరకు అదే శాఖలో పని చేస్తారు. అన్ని పరిణామాలనూ గమనిస్తుంటారు. చెల్లింపులు, వసూళ్ల గురించి వారికి కొట్టిన పిండి. నిద్రలోనైనా ఇట్టే చెప్పేస్తుంటారు. ఇదే ప్రశ్న కన్సల్టెంట్లను అడిగితే వారి ముఖం ప్రశ్నార్థకమవుతుంది.

వెంటనే ఫోన్‌ తీసి గూగుల్‌లో సెర్చ్‌ చేస్తారు. కన్సల్టెంట్ల కంటే ఉద్యోగంలో చేరినప్పటి నుంచి రిటైర్‌ అయ్యే వరకు అదే శాఖలో ఉండే ఉద్యోగులకు రాష్ట్రానికి అవసరమైన నిధులపై అవగాహన ఉంటుంది. అయినప్పటికీ కన్సల్టెంట్లదే పెత్తనంగా మారింది. పోనీ… నిధులు రాబట్టడంలో వీళ్లేమైనా అద్భుతమైన ఫలితాలు సాధిస్తున్నారా అంటే అదీ లేదు. ఉద్యోగులను నమ్మలేం, అందుకే కన్సల్టెంట్లతో పనులు చేయిస్తున్నామని కొందరు అధికారులు బాహాటంగానే చెబుతున్నారు. ఉద్యోగులకు చెప్పలేని రహస్యాలను ప్రైవేటు వ్యక్తులైన కన్సల్టెంట్లకు ఎలా చెబుతారు? పైగా డేటా లీకైతే ప్రభుత్వ ఉద్యోగులను శిక్షించడానికి నిబంధనలు ఉన్నాయి.

ప్రైవేటు వ్యక్తులపై ఎలాంటి చర్యలూ తీసుకోలేరు కదా! అదీగాక వీరిలో అత్యధికులు జగన్‌ తాబేదార్లు. అధికారం పోయినా వారి మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు నడుస్తున్నాయి. ఆర్థిక శాఖలో జరిగేవన్నీ జగన్‌కు తెలిసిపోతున్నాయి. కాంట్రాక్టులు పొందిన ఆయన అనుయాయకులకు సజావుగా చెల్లింపులు జరిగిపోతున్నాయి. ఇదంతా కన్సల్టెంట్ల మహత్యమే. చంద్రబాబు సీఎం అయిన తర్వాత వీరిని తొలగించకపోగా.. మరింత మందిని తెచ్చి అధికార వ్యవస్థపై రుద్దుతున్నారు. అందుకే పాలనలో మార్పులు కనిపించడమే లేదని జనం, క్షేత్రస్థాయి సిబ్బంది పెదవివిరుస్తున్నారు.

‘నైపుణ్యం’ ఎందుకు?

ప్రభుత్వ ఉద్యోగుల్లో నైపుణ్యాలు పెంచడం కోసమంటూ ప్రణాళిక శాఖ ఆ మధ్య ఒక జీవో జారీ చేసింది. ఏపీ స్టేట్‌ కెపాసిటీ బిల్డింగ్‌ కమిటీ, కేంద్రం పరిధిలోని కెపాసిటీ బిల్డింగ్‌ కమిషన్‌ ఆధ్వర్యంలో ఏపీ నాలెడ్జ్‌ సొసైటీ, కెపాసిటీ బిల్డింగ్‌ పాలసీ-2025ని ఆమోదిస్తున్నట్టు అందులో అత్యాధునిక టెక్నాలజీకి అనుగుణంగా ప్రభుత్వ ఉద్యోగులకు శిక్షణ ఇవ్వడం దీని ఉద్దేశం. ఓ వైపు కన్సల్టెంట్లను మితిమీరి ప్రోత్సహిస్తూ… ఉద్యోగులకు నైపుణ్య శిక్షణ ఇచ్చి భవిష్యతలో ప్రభుత్వ అవసరాలకు తగినట్టుగా తీర్చిదిద్దుతామనడమే విచిత్రం! అసలీ కన్సల్టెంట్ల పరిజ్ఞానమేంటో ఎవరు నిర్ధారిస్తున్నారన్నది అంతుపట్టకుండా ఉంది.



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

spot_img

Related articles

పాక్ కు మోదీ డెడ్లీ వార్నింగ్

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ‘‘ఆపరేషన్ సిందూర్’’ చేపట్టిన సంగతి తెలిసిందే. పాక్, పీవోకేలోని ఉగ్ర స్థావరాలపై భారత్ చేసిన మెరుపు దాడి...

హాట్ లైన్లో భారత్ – పాక్ మీటింగ్ షురూ.. భారత్ డిమాండ్లు ఇవే..!

కాశ్మీర్‌లోని పహాల్గాం ఉగ్రదాడి తర్వాత.. భారత్‌ చేపట్టిన.. ఆపరేషన్ సింధూర్‌ దెబ్బకు భారీ నష్టాలే చెవి చూసింది పాకిస్తాన్. తర్వాత అమెరికా అధ్యక్షుడు...

మహేష్ సినిమా విషయంలో మౌనంగా జక్కన్న.. ఈ స్టార్ డైరెక్టర్ ప్లాన్ ఇదేనా?

టాలీవుడ్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు, డైరెక్టర్ రాజమౌళి ( Superstar Mahesh Babu, Director Rajamouli )కాంబినేషన్లో ఒక సినిమా...

పహల్గాం దాడి-భారత్‌ స్పందన – Navatelangana

- Advertisement - మే ఏడవ తేదీ అర్ధరాత్రి తర్వాత భారత సైనిక దళాలు ‘ఆపరేషన్‌ సిందూర్‌’ పేరుతో పాక్‌ భూభాగంలోని తొమ్మిది టెర్రరిస్టు...