– Advertisement –
– నీరు, ఇంధనం, రవాణా, కమ్యూనికేషన్లో ముందంజలో ఉండాలి
– మాతో కలిసి రండి..తెలంగాణ దశ మారుద్దాం..
– తెలంగాణ మంత్రులను కోరిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ
– మంచిర్యాల-వాంకిడి జాతీయ రహదారి 363, సంగారెడ్డి భెల్ ఫ్లైఓవర్, అంబర్పేట ఫ్లైఓవర్ ప్రారంభం
నవతెలంగాణ-కాగజ్నగర్/ రామచంద్రాపురం/అంబర్పేట
రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తే నీటి సరస్సులు గుర్తించి వాటి అభివృద్ధికి పాటుపడతామని, తద్వారా అభివృద్ధి ముందుకెళ్తుందని కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. రాష్ట్ర పర్యటనలో భాగంగా సోమవారం ఆయన మంచిర్యాల, సంగారెడ్డి, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో జాతీయ రహదారి, ఫ్లైఓవర్, కన్హా శాంతి వనంలోలో బయోచార్ సెంటర్, అంబర్పేట వంతెనను ప్రారంభించారు. ముందుగా రూ.3,900 కోట్లతో మంచిర్యాల నుంచి వాంకిడి వరకు నిర్మించిన జాతీయ రహదారి 363ని కేంద్ర, రాష్ట్ర మంత్రులు కిషన్రెడ్డి, బండి సంజరు, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, సీతక్కతో కలిసి నితిన్గడ్కరీ ప్రారంభించారు. ఆ తర్వాత కుమురంభీం-ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ క్రాస్ రోడ్డులో బహిరంగ సభలో ప్రసంగించారు. ఏ రాష్ట్రమైనా అభివృద్ధి చెందాలంటే నీరు, ఇంధనం, రవాణా, కమ్యూనికేషన్ పరంగా ముందంజలో ఉండాలన్నారు. అన్ని రాష్ట్రాలను ఈ దిశగా అభివృద్ధి చేసేందుకు కేంద్రం కృషి చేస్తోందని చెప్పారు. ఈ విషయాల్లో తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం తమతో కలిసి వస్తే రాష్ట్రం దశ మార్చొచ్చన్నారు. జాతీయ రహదారుల నిర్మాణంతో రాష్ట్రాన్ని త్వరితగతిన అభివృద్ధి దిశలో తీసుకెళ్తున్నట్టు తెలిపారు. అన్ని జిల్లాల నుంచి రాష్ట్ర రాజధానికి జాతీయ రహదారుల నిర్మాణం చేపట్టినట్టు తెలిపారు. రాబోయే మూడేండ్లలో తెలంగాణ రాష్ట్రంలో పలు ప్రాజెక్టులు, జాతీయ రహదారుల నిర్మాణానికి భారీగా నిధులు కేటాయించనున్నట్టు చెప్పారు. 2014కు ముందు తెలంగాణలో 2,500 కిలోమీటర్ల జాతీయ రహదారులు ఉండగా, గడిచిన పదేండ్లలో దీన్ని 4,900 కిలోమీటర్లకు పెంచినట్టు వివరించారు. ములుగు, కొత్తగూడెం, ఆదిలాబాద్, గద్వాల జిల్లాల నుంచి హైదరాబాద్కు త్వరితగతిన చేరే విధంగా జాతీయ రహదారులను అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఇండోర్-హైదరాబాద్ న్యూ గ్రీన్ ఎక్స్ప్రెస్ హైవే పనులు తెలంగాణలో పూర్తయ్యాయని, వచ్చే ఏడాది మార్చి నాటికి ఈ రహదారిని జాతికి అంకితం చేయనున్నట్టు తెలిపారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఆర్థికం గా, సామాజికంగా వెనుకబడిందని, ఇటువంటి ప్రాంతాల అభివృద్ధే తమ ధ్యేయమని అన్నారు. పక్కనే ఉన్న మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా ఇప్పుడి ప్పుడే అభివృద్ధిని చూస్తోందన్నారు. మహారాష్ట్రలోని విదర్భలో రైతులు ఎక్కువ మంది ఆత్మహత్య చేసుకునే వారని, అక్కడ నీటి నిల్వలు పెంచడంతో ఇప్పుడు ఆత్మహత్యలు తగ్గాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్, పెద్దపల్లి ఎంపీలు నగేష్, వంశీకృష్ణ, ఉమ్మడి ఆదిలాబాద్ ఎమ్మెల్సీ దండె విఠల్, ఎమ్మె ల్యేలు కోవ లక్ష్మి, పాల్వాయి హరీష్ బాబు, పాయల శంకర్, వెడ్మ బొజ్జు, రామారావు పటేల్, రోడ్లు, భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి వికాస్రాజ్ తదితరులు పాల్గొన్నారు.
భేల్ ఫ్లై ఓవర్ జాతికి అంకితం
సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలోని భేల్ చౌరస్తా వద్ద నిర్మించిన ఫ్లై ఓవర్ను కేంద్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రారంభించి జాతికి అంకితం చేశారు. రూ.136 కోట్లతో భేల్ జంక్షన్ వద్ద ఫ్లై ఓవర్ నిర్మాణానికి 2022లో నిధులు మంజూరయ్యాయి. సుమారు 1.65 కిలోమీటర్ల మేర ఫ్లై ఓవర్ను నిర్మించారు. నితిన్ గడ్కరీతోపాటు మరో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దామోదర్ రాజనర్సింహ, కొండా సురేఖ, ఎంపీలు రఘునందన్రావు, విశ్వేశ్వర్రావు, ఎమ్మెల్యేలు మహిపాల్ రెడ్డి, గాంధీ, కార్పొరేటర్ పుష్ప, వివిధ శాఖల అధికారులు ఫ్లైఓవర్ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు.
కన్హా శాంతి వనంలో బయోచార్ సెంటర్ ప్రారంభం
రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం నందిగామ మండల పరిధిలోని హార్ట్ఫుల్నెస్ ఇన్స్టిట్యూట్ ప్రధాన కార్యాలయం కన్హా శాంతి వనంలో హార్ట్ఫుల్నెస్ ఇన్స్టిట్యూట్, పేపాల్ రూపొందించిన బయోచార్ సెంటర్ను హార్ట్ఫుల్నెస్ ఇన్స్టిట్యూట్ వ్యవస్థాపక అధ్యక్షులు కామేష్పటేల్, పేపాల్ సీనియర్ డైరెక్టర్ శ్రీనాథ్ పరమేశ్వరన్, కేంద్ర మంత్రి కిషన్రెడ్డితో కలిసి కేంద్ర మంత్రి గడ్కరీ ప్రారంభించారు. భారతదేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక చిరు వ్యాపారులు, రైతులు అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు శ్రీధర్బాబు, కోమటిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అంబర్పేట వంతెన ప్రారంభం
హైదరాబాద్ నగరంలోని అంబర్పేట కూడలిలో నిర్మించిన వంతెనను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రారంభించారు. రోడ్ల నిర్మాణం కోసం పెండింగ్లో ఉన్న భూసేకరణపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టాలన్నారు. అంబర్పేటలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ ఫ్లైఓవర్ పనులు సరిగ్గా జరగడం లేదన్నారు. అందుకే పనులు వేగంగా చేసేలా కొత్త కాంట్రాక్టర్ను మార్చామని, పది నెలల్లో ఉప్పల్ ఫ్లైఓవర్ పూర్తి చేస్తామని చెప్పారు. ”హైదరాబాద్లో ఐటీతోపాటు ఫార్మా రంగం కూడా పెద్దదే. అన్ని ప్రధాన నగరాలను హైదరాబాద్కు కనెక్ట్ చేసేలా జాతీయ రహదారులు అభివృద్ధి చేశాం. తెలంగాణ అభివృద్ధికి మోదీ నేతృత్వంలో మేమంతా కట్టుబడి ఉన్నాం. ఇండోర్- హైదరాబాద్ కారిడార్ తెలంగాణ పనులు పూర్తి చేశాం. మహారాష్ట్రలో కూడా పనులు త్వరితగతిన పూర్తి చేస్తాం. ఈ కారిడార్ పూర్తయితే 20 గంటల ప్రయాణం 10 గంటల్లోనే చేయొచ్చు. హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్డు పనులు త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటాం. హైదరాబాద్ – విజయవాడ 4 లైన్ల రోడ్డును 6 లైన్లుగా మారుస్తాం” అని చెప్పారు. హైదరాబాద్ రింగ్ రోడ్డుపై డబుల్ డెక్కర్ ఎయిర్ బస్ను నడిపి చూడాలన్నారు. డీజిల్, పెట్రోల్ వాహనాలను తగ్గించి.. సీఎన్జీ, ఎలక్ట్రికల్ వాహనాలను ప్రోత్సహించాలన్నారు. రైతన్నలు వ్యవసాయంలో కూడా పర్యావరణహిత వాహనాలను వాడాలని సూచించారు. అంబర్పేట పైవంతెనను రూ.265 కోట్లతో నాలుగు వరుసల్లో సుమారు 1.5 కి.మీ మేర నిర్మించగా.. చందానగర్ నుంచి బీహెచ్ఈఎల్ మీదుగా రామచంద్రాపురం వరకు రూ.176 కోట్లతో 1.6కి.మీ మేర బీహెచ్ఈఎల్ వంతెనను నిర్మించారు.
ఇదిలా ఉండగా అంబర్ పేట పై వంతెన ప్రారంభోత్సవ సమయంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాంగ్రెస్, బీజేపీ శ్రేణుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. బీజేపీ నాయకులు ‘మోడీ.. మోడీ..’ అంటూ నినాదాలు చేశారు. కాంగ్రెస్ నాయకులు పోటీగా నినాదాలు చేశారు. ఈ క్రమంలో గడ్కరీ కాన్వారును కాంగ్రెస్ నేతలు అడ్డుకున్నారు. దాంతో వారిని పోలీసులు చెదరగొట్టారు.
– Advertisement –