వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి విడదల రజనీకి హైకోర్టులో ఊరట లభించింది. ఆమెను అరెస్టు చేయకుండా.. కేవలం విచారణకు మాత్రమే పరిమితం కావాలని ఏసీబీ అధికారులకు హైకోర్టు తేల్చి చెప్పింది. గుంటూరు జిల్లా యడ్లపాడుకు చెందిన శ్రీలక్ష్మి స్టోన్ క్రషర్ యజమానిని బెదిరించి, భయపెట్టి.. రూ.2.20 కోట్ల రూపాయలను వసూలు చేశారన్న కేసులోమాజీ మంత్రి రజనీ, ఆమె మరుది(గోపీ నాధ్ను పోలీసులు అరెస్టు చేశారు), పీఏ రామకృష్ణలను నిందితులుగా పేర్కొన్నారు. ఏ1గా మంత్రి రజనీ, ఏ2గా పీఏ, ఏ3గా మరిది గోపి ఉన్నారు.
వీరిలో గోపీనాథ్నుపోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే.. తమను అరెస్టు నుంచి మినహాయించాలని కోరుతూ .. రజనీ, ఆమె పీఏ రామకృష్ణలు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్పై రెండు సార్లు ఇప్పటికే విచారణ జరిగింది. తాజాగా శుక్రవారం జరిగిన విచారణలో వారిద్దరికీ అరెస్టు నుంచి కోర్టు రక్షణ కల్పించింది. అయితే.. వీరికి 41 ఏ కింద నోటీసులు ఇచ్చి వివరణ తీసుకోవాలని ఏసీబీ అధికారులకు స్పష్టం చేసింది. అదేసమయంలో అధికారుల దర్యాప్తును సహకరించాలని పిటిషనర్లను ఆదేశించింది. అదేసమయంలో కేసుకు సంబంధించిన విషయాలను మీడియాతో మాట్లాడడానికి వీల్లేదని ఆదేశించింది.

అలాగే.. అధికారులకు సహకరించకుండా తప్పించుకోవద్దని, సాక్షులకు ఫోన్లు చేయడం.. వారిని బెదిరించడం వంటి వాటికి దూరంగా ఉండాలని.. అలా చేసినట్టు తెలిస్తే.. తాము ఇచ్చే ఆదేశాలను వెనక్కి తీసుకుంటామని హైకోర్టు హెచ్చరించింది. ఇక, రజనీ మరిదిని పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారని తెలిపిన హైకోర్టు.. ఆయన బెయిల్ పిటిషన్ను వెనక్కి తీసుకోవాలని సూచించింది. ఏసీబీ అధికారులు.. రజనీని విచారించే సమయంలో ఆమె తరఫున న్యాయవాదిని అనుమతించాలని.. దురుసుగా ప్రవర్తించరాదని తేల్చి చెప్పింది. ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల మధ్య విచారించి.. పంపేయాలని తెలిపింది.