టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ కొత్త వివాదంలో ఇరుక్కున్నారు. ఇటీవల జరిగిన `రెట్రో` మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో విజయ్ దేవరకొండ చేసిన వ్యాఖ్యల పట్ల గిరిజన సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. విజయ్ క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కార్తీక్ సుబ్బరాజు డైరెక్షన్ లో సూర్య, పూజా హెగ్డే జంటగా నటించిన `రెట్రో` మూవీ మే 1న రిలీజ్ కాబోతోంది.
ఈ నేపథ్యంలో ఇటీవల ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించగా.. విజయ్ దేవరకొండ స్పెషల్ గెస్ట్ గా పాల్గొన్నాడు. ఈ సందర్భంగా పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిపై విజయ్ రియాక్ట్ అయ్యాడు. స్టేజ్ పై విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. పహల్గాంలో జరిగిన ఘటన ఎంతో బాధాకరమన్నారు. 500 ఏళ్ల క్రితం గిరిజనులు ఘర్షణ పడినట్లుగా కశ్మీర్లో దాడులు చేస్తున్నారని.. అక్కడ జరుగుతున్న దురాగతాలకు కారణం చదువు లేకపోవడమే అని.. వాళ్ళందరికీ చదువు చెప్పించి బ్రెయిన్ వాష్ కాకుండా ఉండేలా శిక్షణ ఇవ్వాలని విజయ్ వ్యాఖ్యానించారు. కాశ్మీర్ ఇండియాదే.. కాశ్మీరులు మనవాళ్లే.. మనమంతా ఒకటిగా కలిసి ఉండాలంటూ పిలుపునిచ్చారు.

అయితే విజయ్ గిరిజనులు అనే పదాన్ని ఉపయోగించడం పట్ల గిరిజన సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఉగ్రవాదుల చర్యలను నాటి గిరిజనుల ఘర్షణలతో పోల్చడం తమను కించపరచడమేనని.. 500 సంవత్సరాల క్రితం కేవలం గిరిజనులు మాత్రమే ఘర్షణ పడినట్టుగా విజయ్ మాట్లాడటం సరికాదని వారు మండిపడుతున్నారు. తమ మనోభావాలను దెబ్బతీసేలా మాట్లాడిన విజయ్.. బేషరతుగా గిరిజన సమాజానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. మరి ఈ ఇష్యూపై విజయ్ దేవరకొండ ఎలా రియాక్ట్ అవుతాడన్నది చూడాలి. కాగా, విజయ్ ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో `కింగడమ్` మూవీ చేస్తున్నాడు. మే 30న ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతుంది.