వైసీపీ హయాంలో మద్యం అమ్మకాలలో భారీగా అవకతవకలు జరిగాయని టీడీపీ నేతలు గతంలో ఆరోపించిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా డిజిటల్ లావాదేవీలు మద్యం దుకాణాల దగ్గర జరగడంలేదని, ఆన్ లైన్, యూపీఐ పేమెంట్లను జగన్ సర్కారు అనుమతించలేదని తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. ఆ తర్వాత థూథూ మంత్రంగా డిజిటల్ పేమెంట్ లను వైసీపీ ప్రభుత్వం అనుమతించినా ఎక్కువగా లావాదేవీలు నగదు రూపంలోనే జరిగేవి.
ఈ నేపథ్యంలోనే తాజాగా రచ్చకెక్కిన వైసీపీ నేతల లిక్కర్ స్కామ్ పై మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. 1.30 లక్షల కోట్ల విలువైన నగదు లావాదేవీలు జరగడం దేశంలో ఎక్కడా లేదని ఆయన అన్నారు. అక్రమంగా దోచుకోవడం కోసమే డిజిటల్ పేమెంట్లను జగన్ అనుమతించలేదని ఆరోపించారు.

ప్రధాని మోదీ డిజిటల్ ఇండియా అంటుంటే జగన్ మాత్రం క్యాష్ ఆంధ్రప్రదేశ్గా మార్చారని విమర్శలు గుప్పించారు. జగన్ హయాంలో జరిగిన లిక్కర్ కుంభకోణంపై సిట్ మరింత లోతుగా విచారణ జరపాల్సిన అవసరముందని సోమిరెడ్డి చెప్పారు. ఈ స్కామ్ రూ. 3200 కోట్లకు పరిమితం కాలేదని, రూ.10 వేల కోట్లకు పైనే అని ఆరోపించారు. రూ.1.30 లక్షల కోట్ల క్యాష్ ట్రాన్సాక్షన్ జరుగుతుంటే గత ఐదేళ్లు ఈడీ, సీబీఐ ఈ కుంభకోణంపై ఎందుకు దృష్టి సారించలేదని ప్రశ్నించారు. వైసీపీ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్ ఆషామాషీ కేసు కాదని అన్నారు.