National
oi-Syed Ahmed
కేరళలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధాని మోడీ శబరిమలతో పాటు ఇతర ప్రార్ధనాలయాల విషయంలో ఎల్టీఎఫ్ సర్కారు అనుసరిస్తున్న వైఖరిని టార్గెట్ చేశారు. శబరిమల పరిధిలోకి వచ్చే పతనంతిట్టలోని స్ధానిక స్టేడియంలో జరిగిన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న ప్రధాని శబరిమల పేరెత్తకుండానే ఎల్టీఎఫ్ సర్కారు ప్రార్ధనా స్ధలాల్ని అస్ధిరం చేసే ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు.
భారతీయ సంస్కృతిని దెబ్బతీసే ఇలాంటి ప్రయత్నాలను బీజేపీ అడ్డుకుంటుందని ప్రకటించారు.
బీజేపీ రాజకీయాల్లోకి విద్యావంతులు రావాలని కోరుకుంటోందని ప్రధాని మోడీ తెలిపారు. అందుకే మెట్రోమ్యాన్ శ్రీధరన్ వంటి వారు పార్టీలోకి వస్తున్నారని ప్రధాని గుర్తు చేశారు. ఇప్పటికే ఆయన ఎంతో చేశారని, ఇప్పుడు సమాజ సేవ కోసం బీజేపీలోకి వచ్చారని మోడీ తెలిపారు. లోక్నాయక్ జయప్రకాశ్ నారాయణ్ నాయకత్వంలో 1970ల్లో తాము అవినీతి వ్యతిరేక, ఎమర్జెన్సీ వ్యతిరేక ఉద్యమాలు చూశామని ప్రధాని వెల్లడించారు. వివిధ భావజాలాలకు చెందిన ప్రజలు అప్పట్లో అవినీతి, నియంతృత్వానికి వ్యతిరేకంగా కలిసి పనిచేసారన్నారు.

ఈసారి కేంద్ర బడ్జెట్లో ఎన్నో ఆర్ధిక కారిడార్లు ప్రకటించామని, ఇందులో ముంబై-కన్యాకుమారి కారిడార్ ద్వారా కేరళకు కూడా స్ధానం కల్పించామని మోడీ తెలిపారు. దీంతో కేరళలో 1100 కిలోమీటర్ల మేర రహదారులు అభివృద్ధి అవుతాయని మోడీ తెలిపారు. ఈ ప్రాజెక్టుల విలువ మొత్తం రూ.65 వేల కోట్లని మోడీ పేర్కొన్నారు. కేరళలో ఎల్టీఎఫ్, యూడీఎఫ్ ప్రభుత్వాల వల్ల ఒరిగేది లేదని, అభివృద్ధి అజెండాతో పనిచేస్తున్న బీజేపీని గెలిపించాలని మోడీ ఓటర్లను కోరారు.