ఒకేసారి 500 విమానాల ఆర్డర్
గురుగ్రాం కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న భారతీయ విమానయాన సంస్థ ఇండిగో షాకింగ్ ప్రకటన చేసింది. టర్కిష్ ఎయిర్ లైన్స్ తో కలిసి యూరప్ కు సైతం తన పరిధిని విస్తరించడానికి సిద్ధపడినట్లు పేర్కొంది.
ఈ ప్రణాళికలో భాగంగా 500 విమానాల కోసం ఆర్డర్ చేసినట్లు ఇండిగో అంతర్జాతీయ సేల్స్ హెడ్ వినయ్ మల్హోత్రా శుక్రవారం ప్రకటించారు. భారత్ నుంచి ఇస్తాంబుల్, యూరప్ వెళ్లే ప్రయాణీకులకు సేవలను మరింత మెరుగుపరచడంలో ఇవి సహాయపడతాయని అభిప్రాయం వ్యక్తం చేశారు.
టర్కీ, యూరప్ లే లక్ష్యంగా..
“ప్రస్తుతం రోజుకు 1,800 విమానాలను మేము నడుపుతున్నాం. వాటిలో 10 శాతం అంతర్జాతీయ మార్గాల్లో ప్రయాణిస్తున్నాయి. అవి కూడా భారత ఉపఖండంతో పాటు కొన్ని దేశాల చుట్టూనే పరిమితమై ఉన్నాయి. మరింత దూరం వెళ్లడానికి ఆసక్తిగా ఉన్నాం. టర్కీ, యూరప్ లోకి చొచ్చుకుపోవాలని ప్రణాళికలు రచించాం. అందుకే టర్కిష్ ఎయిర్ లైన్స్ తో కోడ్ షిప్ భాగస్వామ్యం కుదుర్చుకున్నాం” అని వినయ్ తెలిపారు. ఎయిరిండాయా తరహాలోనే ఎయిర్ బస్, బోయింగ్ సంస్థల నుంచి వీటిని ఆర్డర్ చేసినట్లు వెల్లడించారు.
పోటీని స్వాగతిస్తాం
ఎయిరిండియా 470 విమానాలు ఆర్డర్ చేసిన రెండు రోజుల వ్యవధిలోనే ఇండిగో నుంచి ఈ ప్రకటన రావడంపై మల్హోత్రా స్పందించారు. పోటీని ఎల్లప్పుడూ స్వాగతిస్తామన్నారు. కొత్తగా పాస్ పోర్ట్ పొందిన భారతీయులు మొదటగా విదేశాలకు వెళ్లాలని చూస్తున్నట్లు పేర్కొన్నారు. కాబట్టి సరిహద్దులు చెరిపేస్తూ, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా వారికి ఇష్టమైన ప్రదేశానికి తీసుకువెళ్లడానికి సరైన సమయం ఇదేనని భావిస్తున్నట్లు చెప్పారు.
విదేశాల్లో రెండు చోట్ల పాయింట్లు:
భవిష్యత్తులో కెన్యాలోని నైరోబి, ఇండొనేషియాలోని జకార్తాలో మరో రెండు కొత్త పాయింట్లను ప్రారంభించనున్నట్లు వినయ్ ప్రకటించారు. కొన్ని దేశీయ మార్కెట్లో, మరికొన్ని విదేశాల్లో మోహరించబడతాయని వెల్లడించారు. యూరప్ కు అత్యుత్తమ కనెక్టివిటీని అందిచనున్నట్లు పేర్కొన్నారు. క్యారియర్ సేవల్లో అవాంతరాలు లేకుండా సరసమైన ధరలతో, సమయానుకూల పనితీరు కనబరచనున్నట్లు చెప్పారు.