భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం ఏర్పడిన సంగతి తెలిసిందే. ఎల్ వోసీ దగ్గర ఇరు దేశాల మధ్య కాల్పులు జరుగుతుండగా..ఇరు వైపులా ప్రాణ నష్టం కలుగుతోంది. ఈ క్రమంలోనే భారత్ పై పాక్ భారీ కుట్ర పన్నిందని భారత విదేశాంగా కార్యదర్శి విక్రమ్ మిస్రీ వెల్లడించారు. 400 డ్రోన్లతో భారత్ లోని 36 ప్రాంతాలపై నిఘా పెట్టేందుకు పాక్ పెద్ద కుట్ర పన్నిదని ఆయన వెల్లడించారు. జమ్ము కశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లోని 36 ప్రాంతాలను ఎంపిక చేసుకుందని తెలిపారు.
టర్కీకి చెందిన ‘ఆసిస్గార్డ్ సోంగర్’ రకం డ్రోన్లను పాకిస్థాన్ ఉపయోగించినట్లు ప్రాథమిక అంచనా వేశారు. భారత గగనతల రక్షణ వ్యవస్థలను పరీక్షించడం, నిఘా సమాచారాన్ని సేకరించడం కోసం వాటిని ఉపయోగించిందని పేర్కొన్నారు. పాకిస్థాన్ కవ్వింపు చర్యలకు దిగిందని, నియంత్రణ రేఖ వెంబడి ఉల్లంఘనలకు పాల్పడుతూ భారత సైనిక స్థావరాలే లక్ష్యంగా దాడులు చేస్తోందని ఆరోపించారు.

ఇక, భారత్ పై దాడి చేసిన తర్వాత పౌర విమానాలను రక్షణ కవచాలుగా పాక్ వాడుకుందని భారత రక్షణ శాఖ ప్రతినిధులు తీవ్ర ఆరోపణలు చేశారు. పాకిస్థాన్ డ్రోన్, క్షిపణి దాడులు ప్రారంభించినప్పటికీ, కరాచీ, లాహోర్ మధ్య పౌర విమాన సర్వీసులను నిలిపివేయలేదని వారు తెలిపారు. తమ డ్రోన్ దాడులకు భారత్ నుంచి ప్రతిస్పందన వస్తుందని తెలిసి కూడా, పౌర విమానాలను అడ్డుపెట్టుకోవడం ద్వారా పాకిస్థాన్ అత్యంత బాధ్యతారహితంగా వ్యవహరించిందని ఫైర్ అయ్యారు. ప్రార్థనా మందిరాలను కూడా లక్ష్యంగా చేసుకుని పాక్ దాడులు చేస్తోందని, కానీ, ప్రపంచాన్ని తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తోందని వారు ఆరోపించారు.