ఇటీవలే ఈ కొత్త ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్కి సంబంధించిన చిత్రాలు కూడా ఇంటర్నెట్లో తొలిసారిగా లీక్ అయ్యాయి. ఓలా తమ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కోసం తమిళనాడులో హోసూర్లో ఓ మెగా ఫ్యాక్టరీని నిర్మిస్తోంది. తాజాగా, ఇందుకు సంబంధించిన ఓ వీడియోని కూడా ఓలా రిలీజ్ చేసింది.

గడచిన జనవరి నెలలో ఓలా సంస్థ తమిళనాడు ప్రభుత్వం నుండి హోసూర్లో స్థలాన్ని కొనుగోలు చేసింది. ఫిబ్రవరి 7వ తేదీ నుండి కంపెనీ తమ ఫ్యాక్టరీ పనులను ప్రారంభించింది. సుమారు 500 ఎకరాల స్థలంలో ప్రపంచంలో కెల్లా అతిపెద్ద స్కూటర్ల తయారీ కర్మాగారాన్ని నిర్మిస్తున్నట్లు ఓలా పేర్కొంది.
ఈ స్థలంలో భూమిని చదును చేసేటప్పుడు అడ్డు వచ్చిన ప్రతి చెట్టును కూడా తిరిగి వేరే స్థలంలోకి సురక్షితంగా మార్చినట్లు కంపెనీ తమ వీడియోలో తెలిపింది. ప్రకృతి చుట్టూ నిర్మితమవుతున్న ఈ ప్లాంట్, భవిష్యత్తులో ఎలక్ట్రిక్ మొబిలిటీకి పెద్ద పీఠ వేస్తుందని కంపెనీ పేర్కొంది.

తమిళనాడు ప్రభుత్వం నుండి రూ.2400 కోట్లు వెచ్చించి ఓలా ఈ స్థలాన్ని కొనుగోలు చేసినట్లు సమాచారం. ఓలా ఈ కొత్త ప్లాంట్ నిర్మాణాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేయాలని యోచిస్తోంది. సుమారు 10 మిలియన్లకు పైగా శ్రామిక శక్తిని ఉపయోగించి ప్లాంట్ నిర్మాణాన్ని పూర్తి చేసి, అతి తక్కువ సమయంలో ఉత్పత్తిని ప్రారంభించాలని ఓలా భావిస్తోంది.

ప్రతి ఏటా 2 మిలియన్ ఎలక్ట్రిక్ స్కూటర్లను ఉత్పత్తి చేసే సామర్థ్యంతో హోసూర్లోని ప్లాంట్ను ఓలా నిర్మించనుంది. ఈ ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ కేవలం భారతదేశంలోనే కాకుండా, యుఎస్ఏ, యూరప్, యుకె, ఆసియా పసిఫిక్ దేశాలు, ఆస్ట్రేలియా మరియు న్యూజిలాండ్ సహా ప్రపంచంలోని వివిధ అంతర్జాతీయ మార్కెట్లలో కూడా విడుదల కానుంది.

ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ప్లాంట్ యొక్క తయారీ విభాగంలో, మానవశక్తి మాత్రమే కాకుండా, కృత్రిమ మేధస్సు (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) ఉన్న యంత్రాలను కూడా ఉపయోగించనుంది. ఈ ప్లాంట్లో సుమారు 5,000 రోబోట్లను ఉపయోగించే అవకాశం ఉంది. ఈ ప్లాంట్ ద్వారా 10,000 మందికి పైగా ఉపాధి లభిస్తుందని ఓలా తెలిపింది.

ఓలా గడచిన మే 2020లో నెథర్లాండ్స్కి చెందిన ఎటెర్గో అనే ఓ ఎలక్ట్రిక్ స్కూటర్ తయారీ సంస్థను కొనుగోలు చేసింది. తమిళనాడులో ఈ కొత్త ప్లాంట్ను ఏర్పాటు చేసేందుకు సీమెన్స్ సంస్థతో ఒప్పందాన్ని కూడా కుదుర్చుకుంది.

ఎటెర్గో గతంలో అంతర్జాతీయ మార్కెట్ల కోసం తయారు చేసిన ‘యాప్స్కూటర్’ ఆధారంగానే ఓలా ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ను తయారు చేయనుంది. ఎటర్గో యాప్స్కూటర్ను కాస్తంత అప్గ్రేడ్ చేసి, ఇండియన్ మార్కెట్కి అనువుగా దీనిని స్వల్పంగా రీడిజైన్ చేసినట్లు సమాచారం.

ఇందులో ముందు వైపు ఒకే సింగిల్ టెలిస్కోపిక్ సస్పెన్షన్ సెటప్ ఉంటుంది. ఈ స్కూటర్లో ఉపయోగించిన ఎలక్ట్రిక్ మోటార్ మరియు బ్యాటరీల సాయంతో ఇది గంటకు 100 కిలోమీటర్ల గరిష్ట వేగంతో పరుగులు తీస్తుందని సమాచారం. అలాగే, ఇందులోని లిథియం అయాన్ బ్యాటరీలు పూర్తి ఛార్జీపై 240 కిలోమీటర్ల వరకూ రేంజ్ను అందిస్తాయని అంచనా.

పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కేవలం 3.9 సెకన్లలోనే గంకు 0-45 కిలోమీటర్ల వేగాన్ని చేరుకునే అవకాశం ఉంది. ఎటెర్గో యాప్స్కూటర్ను భారత మార్కెట్కు అనుగుణంగా కంపెనీ మోడిఫై చేయనుంది. మార్కెట్ అంచనా ప్రకారం, దీని ధర రూ.1 లక్ష వరకూ ఉండొచ్చని తెలుస్తోంది.