స్టాక్ ఎక్స్ఛేంజ్..
అదానీ స్టాక్స్ కుప్పకూలటంతో దేశంలోని రెగ్యులేటరీ సంస్థలు ఒక్కసారిగా అప్రమత్తమయ్యాయి. అసలు అదానీ కంపెనీల్లో ఏం జరుగుతోందనే విషయాన్ని నిశితంగా పరిశీలించటం ప్రారంభించాయి. ఈ క్రమంలో అదానీ గ్రూప్ ఫ్లాగ్షిప్ కంపెనీ అయిన అదానీ ఎంటర్ప్రైజెస్ పై నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ స్వల్పకాలిక అదనపు నిఘాను ఏర్పాటు చేసింది.
అదానీకి శుభవార్త..
గౌతమ్ అదానీకి చెందిన అదానీ ఎంటర్ప్రైజెస్ , అంబుజా సిమెంట్స్, అదానీ పోర్ట్స్, స్పెషల్ ఎకనామిక్ జోన్లతో పాటు ఇతర కంపెనీల షేర్లలో అధిక ఓలటాలిటీ కారణంగా ఫిబ్రవరి 6న NSE స్వల్పకాలిక అదనపు నిఘాను ఏర్పాటు చేసింది. అయితే ప్రస్తుతం పరిస్థితులు కుదుటపడటంతో మార్చి 6న అదనపు నిఘా నుంచి అదానీ ఎంటర్ప్రైజెస్ ను తొలగిస్తున్నట్లు ఎన్ఎస్ఈ ప్రకటించింది. ఇది ఇన్వెస్టర్లలో మరింత నమ్మకాన్ని నింపేందుకు దోహదపడుతుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
గత నెలలో..
తాజా ప్రకటనకు ముందు ఫిబ్రవరి 13న ASM ఫ్రేమ్వర్క్ నుంచి అంబుజా సిమెంట్స్, అదానీ పోర్ట్స్ తొలగించబడ్డాయి. ఇదే సమయంలో గ్లోబల్ అసెట్ మేనేజ్మెంట్ సంస్థ GQG పార్టనర్స్ అదానీ ఎంటర్ప్రైజెస్, అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ పోర్ట్స్, అదానీ ట్రాన్స్మిషన్ కంపెనీల్లో దాదాపు రూ. 15,446 కోట్ల పెట్టుబడులను ప్రకటించింది. దీంతో అనేక వారాలుగా నష్టాల్లో ఉన్న అదానీ గ్రూప్ కంపెనీలు రికవరీ మోడ్ లోకి వచ్చాయి.
స్టాక్ ధర పరిస్థితి..
వరుసగా ఐదు ట్రేడింగ్ సెషన్లలో అదానీ ఎంటర్ప్రైజెస్ షేరు ధర దాదాపు 66 శాతం పుంజుకుంది. దీంతో సోమవారం మార్కెట్లు ముగిసే సమయానికి బీఎస్ఈలో స్టాక్ ధర రూ. 1,982.85 వద్ద ఉంది. అదే విధంగా స్టాక్ ధర ఎన్ఎస్ఈలో రూ.1,982 వద్ద ట్రేడింగ్ ముగించింది. విదేశాల్లో అదానీ గ్రూప్ నిర్వహిస్తున్న రోడ్ షోలకు మంచి స్పందన రావటంతో ఇన్వెస్టర్లలో నమ్మకం పెరుగుతోంది.