|
మోదీ మౌనం వీడండి..
ప్రధానికి కాంగ్రెస్ ప్రశ్నలను సంధించింది. ఈరోజు మీరు మౌనాన్ని విడండి ప్రధాన మంత్రిజీ అంటూ కాంగ్రెస్ కమ్యూనికేషన్ చీఫ్ జైరాం రమేశ్ ట్వీట్ ద్వారా వెల్లడించారు. ఒక ఉన్నత స్థాయి కేంద్ర మంత్రి FPO కోసం గౌతమ్ అదానీ తరపున ఐదుగురు లేదా ఆరుగురు ప్రముఖ వ్యాపారవేత్తలకు వ్యక్తిగత కాల్లు చేయటంపై రమేశ్ ప్రశ్నించారు. FPOలో పెట్టుబడి పెట్టమని కోరింది నిజమేనా ? కేంద్ర మంత్రి మీ సూచనల మేరకే పని చేశారా ? అంటూ ప్రధాని మోదీని ప్రశ్నించారు.
పరువు పోకుండా..
హిండెన్ బర్గ్ రీసెర్చ్ నివేధిక నేపథ్యంలో FPO పూర్తిగా సబ్ స్క్రైబ్ కాకపోతే అదానీ పరువుపోతుందని కేంద్ర మంత్రి రంగంలోకి దిగినట్లు కాంగ్రెస్ చెబుతోంది. అదే సమయంలో ఎఫ్పీవో రద్దు చేయబడుతుందని, పెట్టుబడిదారులకు డబ్బు తిరిగి ఇవ్వబడుతుందని వ్యాపార పెద్దలకు చెప్పారా అని కూడా కాంగ్రెస్ నాయకుడు అడిగారు. ఈ చర్య కేవలం అదానీ ప్రతిష్టను కాపాడటానికి మాత్రమేనని అన్నారు. FPO పెట్టుబడిదారులను ఈ విధంగా మోసం చేయడం నైతికమా ? అని రమేశ్ ప్రశ్నించారు.

ప్రభుత్వ సంస్థలు..
భారతీయ జీవిత బీమా కార్పొరేషన్ రూ.299 కోట్లు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎంప్లాయీస్ పెన్షన్ ఫండ్ రూ.99 కోట్లు, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ రూ.125 కోట్ల ఎఫ్పీవో బిడ్డింగ్ లో ఎందుకు పాల్గొన్నాయంటూ ఆయన ప్రశ్నించారు. ప్రస్తుతం స్టాక్ ధర ఇష్యూ ధర కంటే చాలా తక్కువకు పడిపోయింది. కోట్లాది మంది భారతీయులు పొదుపు చేసిన సొమ్మును కాపాడటంలో భాగంగా ఎల్ఐసీ, ఎస్బీఐకి కేంద్రం అదేశాలు జారీ చేసిందా అంటూ ప్రశ్నించారు.
అదానీ స్టాక్స్ లిస్టింగ్..
MSCI అదానీ కంపెనీ షేర్ల లిక్విడిటీని రివ్యూ చేస్తున్న సమయంలో నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ మరికొన్ని అదానీ గ్రూప్ షేర్లను సూచీలలోకి చేర్చింది. దీని ప్రకారం అదానీ టోటల్ గ్యాస్, అదానీ ఎంటర్ ప్రైజెస్ కంపెనీల షేర్లపై తాజాగా నిర్ణయం తీసుకుంది. ఈ విషయంపై స్పందించిన జైరామ్ రమేశ్ ఎవరు ఫోన్ కాల్ చేయటం వల్ల ఈ నిర్ణయం తీసుకోవటం జరిగిందో అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మెుత్తానికి మోదీ సర్కార్ అదానీని ఎంతదూరమైనా వెళ్లి కాపాడేందుకు సిద్ధంగా ఉందని కాంగ్రెస్ వాదన ప్రకారం తెలుస్తోంది.