అదానీ పోర్ట్స్..
డిసెంబరుతో ముగిసిన మూడో త్రైమాసిక ఫలితాలను అదానీ పోర్ట్స్ నేడు విడుదల చేసింది. అయితే ఇవి అంచనాలకు పూర్తి భిన్నంగా ఉన్నాయి. మార్కెట్ వర్గాల అంచనాలను అందుకోవటంలో పూర్తిగా కంపెనీ వెనకబడింది. విడుదలైన ఫలితాల ప్రకారం త్రైమాసికంలో కంపెనీ నికర లాభం 16 శాతం మేర క్షీణించి రూ.1,316 కోట్లుగా నమోదైంది.

గత ఏడాది..
అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ కంపెనీ ఈ ఏడాది నిరాశపరిచినప్పటికీ గత ఏడాది ఇదే కాలంలో రూ.1,567 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. మార్కెట్లో బ్రోకరేజ్ సంస్థలు సగటున కంపెనీ Q3లో లాభం 11.8 శాతం మేర పెరిగి రూ.1,647.1 కోట్లకు చేరుకుంటుందని అంచనా వేశాయి. అయితే ఏడాది ప్రాతిపదికన ఆదాయం 25 శాతం మేర పెరిగి రూ.4,753 కోట్లకు చేరుకుంది.

పెరిగిన కార్గో రవాణా..
కంపెనీ కార్గో వాల్యూమ్ త్రైమాసికంలో ఒక్క శాతం మేర పెరిగి 75.43 మిలియన్ మెట్రిక్ టన్నులకు చేరుకుంది. కంటైనర్ వాల్యూమ్ సైతం 2 శాతం మేర పెరిగింది. ముంద్రా పోర్టు కాకుండా మిగిలిన కార్గో రవాణా దాదాపుగా 7 శాతం మేర పెరిగినట్లు కంపెనీ వెల్లడించింది. అయితే ముంద్రా పోర్టు ద్వారా కార్గో రవాణా 4 శాతం మేర తగ్గినట్లు తేలింది.

రుణాల చెల్లింపు..
ప్రస్తుతం అదానీ గ్రూప్ కంపెనీలు భారీ రుణ భారాన్ని మోస్తున్నాయని హిండెన్ బెర్గ్ తో పాటు మరింత మంది చెబుతున్న సంగతి తెలిసిందే. అయితే 2024 ఆర్థిక సంవత్సరంలో వ్యాపారం ద్వారా వచ్చే అదనపు ఆదాయన్ని కంపెనీ తన రుణాల చెల్లింపునకు వినియోగించాలని నిర్ణయించింది. దీని ద్వారా కంపెనీ దాదాపు రూ.5,000 కోట్ల రుణాన్ని గడువుకు ముందుగా చెల్లించాలనుకుంటున్నట్లు తెలిపింది. మధ్యాహ్నం 2.10 గంటల సమయంలో కంపెనీ స్టాక్ ధర దాదాపు 15 శాతం లాభంలో కొనసాగుతూ రూ.560 వద్ద ట్రేడవుతోంది.