నిబంధనల ఉల్లంఘనే:
ఓలా, ఉబర్, రాపిడో వంటి బైక్ ట్యాక్సీ సేవలను తక్షణమే నిలిపివేయాలని ఢిల్లీ ప్రభుత్వం ఆదేశించినట్లు ఓ ప్రముఖ వార్తా సంస్థ నివేదించింది. ప్రైవేట్ రిజిస్ట్రేషన్ తో కూడిన వాహనాలను రైడ్ షేరింగ్ కింద అద్దెకు వినియోగిస్తుండటాన్ని తప్పుపడుతూ, రవాణా శాఖ సోమవారం నోటీసులు జారీచేసింది. వీటిని వాణిజ్య కార్యకలాపాలకు ఉపయోగించడం, 1988 మోటారు వాహన చట్టాన్ని ఉల్లంఘించడమేనని అందులో పేర్కొంది.
భారీ జరిమానాలు తప్పవు:
మోటారు వాహనాల చట్టం 1988ని ఉల్లంఘిస్తే.. మొదటిసారి రూ.5 వేలు, రెండోసారి రూ.10 వేలు చొప్పున జరిమానా విధించవచ్చని ఆ రాష్ట్ర రవాణా శాఖ పబ్లిక్ నోటీసులో తెలిపింది. ఏడాది జైలు శిక్షతో పాటు మూడు నెలలపాటు డ్రైవర్ లైసెన్స్ సైతం కోల్పోయే అవకాశం ఉందని వెల్లడించింది. కొన్ని యాప్ ఆధారిత కంపెనీలు చట్టాన్ని ఉల్లంఘిస్తూ తమను తాము అగ్రిగేటర్లుగా చిత్రీకరించడానికి ప్రయత్నిస్తున్నాయని పేర్కొంది. అలా చేస్తే రూ.లక్ష జరిమానాతో పాటు జైలు శిక్ష కూడా అనుభవించాల్సి వస్తుందని హెచ్చరించింది.
చట్టం ఏమి చెబుతోంది ?
ప్రైవేటు వాహనాలను కేవలం సొంత అవసరాలకు మాత్రమే వినియోగించాలని మోటారు వాహన చట్టం చెబుతోంది. ఈ వెహికల్స్ సాధారణంగా తెలుపు రంగు నంబర్ ప్లేటుతో ఉంటాయి. వాణిజ్య అవసరాల కోసం ఉపయోగించే ఆటోలు, కార్లు, డీసీఎంలు, టాటా ఏస్ లాంటి రవాణా వాహనాల నంబర్ ప్లేట్లు పసుపు రంగులో దర్శనమిస్తుంటాయి. తెలుపు రంగు ప్లేటుతో ఉన్న ద్విచక్రవాహనాలను.. నిబంధనలకు విరుద్దంగా ఓలా, ఉబర్, రాపిడో వంటి బైక్ ట్యాక్సీ సంస్థల్లో వాణిజ్య అవసరాలకు వినియోగిస్తుండటం ఇప్పుడు వివాదానికి కారణమైంది.