133 శాతం పెరుగుదల:
2017-23 మధ్య 5 ఏళ్లలో వివిధ ఉత్పత్తులపై విధించిన సెస్, సర్ ఛార్జీల ద్వారా కేంద్రం భారీగా ఆదాయం సముపార్జించింది. వీటి సేకరణలో మొత్తం మీద ఏకంగా 133 శాతం పెరుగుదల నమోదైంది. 5 సంవత్సరాల క్రితం దాదాపు 2 లక్షల 18 వేల కోట్లు ఉన్న రాబడి కాస్తా.. 2022 నాటికి 5 లక్షల 10 వేల కోట్లకు పైగానే సాధించిన్టలు ఆర్థిక మంత్రిత్వ శాఖ గణాంకాలే చెబుతున్నాయి.

నిర్దిష్ట అవసరాల కోసమే:
రాజ్యాంగంలోని ఆర్టికల్ 271 ప్రకారం దేశ ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వం సెస్, సర్ ఛార్జీలు విధించవచ్చు. వీటి ద్వారా సమకూరే ఆదాయాన్ని కేంద్ర ప్రాయోజిత పథకాలు, ఫైనాన్సింగ్ వంటి నిర్దిష్ట అవసరాలను తీర్చడానికి వినియోగించాల్సి ఉంటుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఆదాయపు, కార్పొరేట్ పన్నుల వసూళ్లు 25 శాతానికి మించి పెరిగాయి. తద్వారా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు సైతం లబ్ధి పొందాయి.

రాష్ట్రాలకు మొండిచెయ్యి:
సెస్, సర్ ఛార్జీల ప్రయోజనం రాష్ట్రాలకు కూడా అందిస్తే బావుంటుందని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 271లో సూచించిన పన్నులు, సుంకాలపై సర్ చార్జీని రాష్ట్రాలకు ఇవ్వకుండా ఆర్టికల్ 270 మినహాయించింది. నిర్దిష్ట ప్రయోజనం కోసం విధించబడిన ఈ నిధిని.. కేంద్ర, రాష్ట్రాల మధ్య పంపిణీ చేయకుండా పార్లమెంట్ ద్వారా ఈ చట్టం చేయబడింది.

ఇవీ దేశంలో విధించే సెస్ లు..
సెస్ అంటే పన్నుపై పన్ను. దేశంలోని మోటారు వాహనాలపై మౌలిక సదుపాయాల సెస్, సేవా విలువపై కృషి కళ్యాణ్ సెస్, స్వచ్ఛ భారత్ సెస్, విద్య సెస్ మరియు ముడి చమురుపై సెస్ వంటి కొన్ని రకాలను ప్రస్తుతం విధిస్తున్నారు. ఇవన్నీ ఒక నిర్దిష్ట ప్రయోజనం కోసం ఉపయోగించబడుతుండగా.. రూ.50 లక్షల కంటే ఎక్కువ ఆదాయమున్న వ్యక్తులకూ సర్ ఛార్జ్ వర్తిస్తుంది. అయితే దీనికి ఓ స్పష్టమైన కారణం లేదు కానీ కేంద్ర ప్రభుత్వం సహేతుకంగా భావించిన విధంగా దీన్ని వినియోగించవచ్చు.