బెంగళూరుకు ఐఫోన్ ప్లాంట్:
యాపిల్ భాగస్వామిగా పేరున్న తైవాన్ కు చెందిన ఫాక్స్ కాన్ టెక్నాలజీ గ్రూపు చైనా నుంచి పూర్తిగా బయటకు రావాలని భావిస్తోంది. భారతదేశంలో కొత్త ప్లాంట్లు నెలకొల్పాలని చూస్తోందని ఓ ప్రముఖ మీడియా సంస్థ నివేదించింది. ఇందుకోసం 700 మిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టాలని భావిస్తోంది. ఈ మేరకు కర్ణాటకలోని బెంగళూరు విమానాశ్రయానికి సమీపంలో 300 ఎకరాల స్థలాన్ని అనువైనదిగా కంపెనీ గుర్తించింది. ఇక్కడ ఐఫోన్లు తయారు చేయడం కోసం ప్లాంట్ నిర్మించాలని సిద్ధమవుతోంది. యాపిల్ సైతం పెద్దఎత్తున తన పెట్టుబడులను ఇప్పటికే చైనా నుంచి బయటకు తరలించిన విషయం తెలిసిందే.
భారత్, వియత్నాం వైపు కంపెనీల చూపు:
భారత్ లో ఇప్పటివరకు ఫాక్స్ కాన్ పెట్టిన భారీ పెట్టుబడుల్లో బెంగళూరు ప్రాజెక్టు ఒకటిగా నిలవనుంది. యాపిల్ సహా ఇతర అమెరికా బ్రాండ్లు.. భారత్, వియత్నాం వంటి దేశాల వైపు చూస్తూ డ్రాగన్ ఆధారిత సరఫరాదారుల నుంచి దూరం జరుగుతున్నాయి. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, కొవిడ్ అనంతరం ప్రపంచ సరఫరా గొలుసులో ఏర్పడిన తీవ్ర అవాంతరాలు దృష్ట్యా.. ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చర్స్ చైనా విధానాలపై పునరాలోచనలో పడ్డాయి. ఈ చర్యలతో ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తిదారుగా చైనా తన హోదాను కోల్పోయే ప్రమాదం ఉంది.
ఖాళీ కానున్న ఐఫోన్ అసెంబ్లీ యూనిట్:
చైనా జెంగ్ జౌ నగరంలోని విశాలమైన ఐఫోన్ అసెంబ్లీ కాంప్లెక్స్ లో 2 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తుంటారు. అయితే ఇండియాలో నెలకొల్పననున్న బెంగళూరు ప్లాంట్ ద్వారా లక్ష ఉద్యోగాలను సృష్టించగలిగే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు. ఇప్పటికే తెలంగాణలో సైతం మరో లక్ష ఉద్యోగాల కల్పన దిశగా ఫాక్స్ కాన్ పెట్టుబడులకు హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. తద్వారా డ్రాగన్ కు చెందిన ఈ మొత్తం పెట్టుబడిని భారత్ లోని రెండు ప్రదేశాల్లో ఏర్పాటు చేయాలని కంపెనీ భావిస్తున్నట్లు అర్థమవుతోంది. చైనా నుంచి మొత్తం తన సామర్థ్యాన్ని తరలించేందుకు పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది.
భారత్ మంచి ప్రోత్సాహకాలు:
ఈ వార్తలపై యాపిల్, ఫాక్స్ కాన్, కర్ణాటక ప్రభుత్వాలు వ్యాఖ్యానించడానికి నిరాకరించాయి. కార్పొరేట్లు, ప్రైవేట్ రంగంపై చైనా అణచివేత ధోరణితో వ్యవహరిస్తుండటంతో.. ఆయా కంపెనీలు అక్కడ మూసివేతలకు గురవుతున్నాయి. మరో దేశానికి తరలి వెళ్తున్నాయి. గతేడాది తమిళనాడులోనూ ఫాక్స్ కాన్ ఏర్పాటు చేసిన ఐఫోన్ తయారీ ప్లాంట్ కు భారత్ నుంచి మంచి ప్రోత్సాహకాలు లభించాయి. ఇదే కాకుండా విస్ట్రన్ కార్ప్, పెగాట్రాన్ కార్ప్ సైతం ఇండియాలో వేగంగా వృద్ధి చెందుతున్నాయి. ఎయిర్ పాడ్స్ వంటి ఎలక్ట్రానిక్స్ పరికరాల విడిభాగాలు తయారు చేయడం ప్రారంభించాయి.