పావెల్ హెచ్చరిక..
సెంట్రల్ బ్యాంక్ పాలసీ రూపకర్తలు ఊహించిన దాని కంటే వడ్డీ రేట్ల పెంపు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ జెరోమ్ పావెల్ మంగళవారం హెచ్చరించారు. ఈ ప్రకటనతో దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు కుప్పకూలాయి. దీనికి తోడు డాలర్ భారీగా బలపడింది. తాజా ఎకనమిక్ డేటా ప్రకారం రానున్న కాలంలో వడ్డీ రేట్ల పెంపు గతంలో ఊహించినదాని కంటే ఎక్కువగా ఉండనుందని పావెల్ హెచ్చరించారు.
దూకుడు తప్పదా..
ఎకనమిక్ డేటా వేగవంతమైన పాలసీ టైటనింగ్ అవసరమని సూచించినట్లయితే.. దానికి అనుగుణంగా రేట్ల పెంపు వేగాన్ని పెంచేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు పావెల్ తెలిపారు. గత డిసెంబరులో ఫెడ్ అధికారులు టర్మినల్ రేటును 5.1 శాతంగా నిర్ణయించారు. అయితే తాజాగా పావెల్ చేసిన హెచ్చరికల నేపథ్యంలో ఇది రానున్న రోజుల్లో 5.5 శాతం-5.75 శాతం మధ్యకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. అయితే అంతిమంగా రేట్లు ఎంత వరకు పెరుగుతాయనే విషయాన్ని మాత్రం పావెల్ ప్రకటించలేదు.
ప్రపంచ దేశాలు.. భారత్
ద్రవ్యోల్బణం విషయంలో అమెరికా సెంట్రల్ బ్యాంక్ తీసుకునే నిర్ణయాలను భారత్ సహా ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల సెంట్రల్ బ్యాంకులు ఆసక్తిగా ఎదురుచూస్తుంటాయి. అయితే ఈ సారి పావెల్ ప్రకటన చూస్తుంటే రేట్ల పెంపు 50 బేసిస్ పాయింట్ల వరకు ఉండవచ్చని తెలుస్తోంది. రానున్న ఎంపీసీ సమావేశంలో రిజర్వు బ్యాంక్ సైతం ఫెడ్ నిర్ణయానికి అనుకూలంగా రేట్ల పెంపును అధికంగానే ఉంచవచ్చని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలోనే నేడు భారత మార్కెట్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.