ఇండియన్ ఆయిల్..
ఇప్పటికే గ్రీన్ హైడ్రోజన్ రంగంలో దేశీయ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ అందరికంటే నాలుగు అడుగులు ముందుగానే ఉంది. ఈ రంగంలో హైడ్రోజన్ ఇంధనాన్ని ఉత్పత్తి చేయటంతో పాటు దీనిని వినియోగించేందుకు వీలుగా కొత్త తరం వాహనాలను తయారు చేస్తున్న సంస్థలతో జతకట్టి సాంకేతిక సహాయాన్ని సైతం అందిస్తోంది. అయితే ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వ యాజమాన్యంలోని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOC) కూడా ఈ రంగంలో అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేసింది.

2047 నాటికి..
2047 నాటికి తన అన్ని రిఫైనరీలలో గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(IOC) చైర్మన్ శ్రీకాంత్ మాధవ్ వైద్య వెల్లడించారు. ఇది నికర-సున్నా ఉద్గారాలను సాధించడానికి రూ. 2 లక్షల కోట్ల గ్రీన్ ట్రాన్సిషన్ ప్లాన్లో భాగమని ఆయన తెలిపారు. భారత్ ప్రస్తుతం రోజుకు 51 లక్షల బ్యారెళ్ల చమురు దిగిమతి చేసుకుంటోంది. పైగా రానున్న కాలంలో ఈ డిమాండ్ మరింతగా పెరగనుంది.. దీనికి ప్రత్యామ్నాయంగా భారత్ గ్రీన్ హైడ్రోజన్, జీవ ఇంధనాలు, EVలు, ప్రత్యామ్నాయ ఇంధనాల కలయికతో కూడిన ఎకోసిష్టంను అభివృద్ధి చేస్తోంది.

పానిపట్ రిఫైనరీ..
ఇండియన్ ఆయిల్ 2025 నాటికి రూ.2000 కోట్లతో 7,000 టన్నుల సామర్థ్యం కలిగిన గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేసే సదుపాయాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. క్లీన్ ఎనర్జీ కోసం కంపెనీ సుమారు రూ.2 లక్షల కోట్లను పెట్టుబడిగా పెట్టాలని నిర్ణయించిందని వైద్య వెల్లడించారు. గ్రీన్ హైడ్రోజన్ను ఉత్పత్తి చేయడానికి సోలార్ వంటి పునరుత్పాదక వనరుల నుంచి ఉత్పత్తి చేయబడిన విద్యుత్తును ఉపయోగించి నీటిని విభజించాలని IOC భావిస్తోంది. గ్రీన్ హైడ్రోజన్ 5-10 సంవత్సరాలలో మొత్తం హైడ్రోజన్ ఉత్పత్తిలో 50 శాతం, 2040 నాటికి 100 శాతం ఉంటుందని కంపెనీ అంచనా వేస్తోంది.

కూలిన అదానీ కలలు..
ప్రైవేటు రంగంలో రిలయన్స్ ఇప్పటికే గ్రీన్ హైడ్రోజన్ ఇంధనాన్ని అభివృద్ధి చేసేందుకు భారీగా పెట్టుబడులను పెట్టింది. అయితే ఇదే క్రమంలో వ్యాపార దిగ్గజం గౌతమ్ అదానీ సైతం భవిష్యత్తు ఇంధన రంగంలోకి అడుగు పెట్టాలని నిర్ణయించారు. దీనికోసం ఫ్రాన్స్కు చెందిన టోటల్ ఎనర్జీస్ కంపెనీతో చర్చలు కూడా జరిపింది. అయితే ఈ క్రమంలో అమెరికా రీసెర్చ్ సంస్థ హిండెన్ బెర్గ్ సంచలన రిపోర్ట్ రావటంతో అది కాస్తా నిలిచిపోయింది. ఒప్పందం కుదుర్చుకోనప్పటికీ కంపెనీ స్టాక్ నష్టాలను ఎదుర్కోవలసి వచ్చింది.