2017లో స్థాపన..
అమెరికా పరిశోధనా సంస్థ హిండెన్బర్గ్ 2017లో స్థాపించటం జరిగింది. దీని వ్యవస్థాపకుడు నాథన్ ఆండర్సన్. అతను యూనివర్శిటీ ఆఫ్ కనెక్టికట్ నుంచి ఇంటర్నేషనల్ బిజినెస్లో గ్రాడ్యుయేట్ డిగ్రీని పొందాడు.ఆయన తన వృత్తిని డేటా కంపెనీ అయిన ఫ్యాక్ట్సెట్ రీసెర్చ్ సిస్టమ్స్ ఇంక్తో ప్రారంభించాడు.
ఆ తర్వాత 2017లో తన షార్ట్ సెల్లింగ్ సంస్థ హిండెన్బర్గ్ రీసెర్చ్ను ప్రారంభించాడు. మే 6, 1937న న్యూజెర్సీలోని మాంచెస్టర్ టౌన్షిప్లో జరిగిన హిండెన్బర్గ్ ఎయిర్షిప్ ప్రమాదం నుంచి కంపెనీకి ఈ పేరును ఎంచుకున్నారు. కంపెనీ వ్యవస్థాపకుడు ఇజ్రాయెల్లో అంబులెన్స్ డ్రైవర్గా కూడా పనిచేశారు.

హిండెన్బర్గ్ ఏం చేస్తుంది..?
ఈ కంపెనీ నిజానికి ఈక్విటీ, క్రెడిట్, డెరివేటివ్లను విశ్లేషించే ఫోరెన్సిక్ ఫైనాన్షియల్ రీసెర్చ్ సంస్థ. కంపెనీల్లో అకౌంటింగ్ అక్రమాలు, నిర్వహణ స్థాయి లోపాలు, రహస్య ట్రాక్సాక్షన్లను కంపెనీ తన ఆడిట్ ద్వారా వెలికితీస్తుంటుంది. ఇప్పటి వరకు ఈ కంపెనీ ప్రపంచవ్యాప్తంగా దాదాపు 16 కంపెనీలలో అక్రమాలకు సంబంధించి రిపోర్టులను బహిర్గతం చేసింది. ఈ కంపెనీ టార్గెట్ చేసుకున్న కంపెనీలకు వ్యతిరేకంగా పందెం కాయటం ద్వారా కూడా లాభాన్ని ఆర్జిస్తుంటుంది.

అదానీపై అలిగేషన్స్..
అదానీ గ్రూప్కు చెందిన అన్ని కంపెనీల రుణాలపై హిండెన్బర్గ్ నివేదిక ప్రశ్నలు లేవనెత్తింది. స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన 7 గ్రూప్ కంపెనీల విలువ 85 శాతం ఓవర్ వాల్యూ అయినట్లు వెల్లడించింది. మెుత్తంగా రీసెర్చ్ అదానీ గ్రూప్ పై 88 ప్రశ్నలు సంధించింది. దీంతో అదానీ గ్రూప్ కంపెనీలు ఈనెల 25 నుంచి దాదాపుగా రూ.2.37 లక్షల కోట్ల కంటే ఎక్కువ మెుత్తాన్ని నష్టపోవాల్సి వచ్చింది. షేర్ల ధరల్లో పతనం వచ్చే వారం కూడా కొనసాగవచ్చని తెలుస్తోంది.
న్యాయపోరాటం..
తాము ఇచ్చిన రిపోర్టుకు కట్టుబడి ఉంటామని హిండెన్బర్గ్ బహిరంగంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. అయితే హిండెన్బర్గ్ నివేదిక పూర్తిగా నిరాధారమైన, నష్టం కలిగించే ఆరోపణలు చేసినట్లు అదానీ గ్రూప్ స్టేట్మెంట్ విడుదల చేసింది. పైగా దీనిపై న్యాయపరమైన చర్యలు చేపడతామని వెల్లడించింది.