రెండోసారి బెంచ్ మార్క్ కు ఎగువే
ఫిబ్రవరి నెలకుగాను దేశ రిటైల్ ద్రవ్యోల్బణం 6.44 శాతం ఉన్నట్లు గణాంకాల శాఖ సోమవారం ప్రకటించింది. గత నెలలోని 6.52 శాతంతో పోలిస్తే కొంతమేర పరిస్థితి చక్కబడినట్లు వెల్లడించింది. అయితే వరుసగా రెండోసారి సైతం RBI బెంచ్ మార్క్ కి ఎగువనే ఉండటం కొంత ఆందోళన కలిగిస్తోంది.
దీనికి తోడు 3 నెలల గరిష్ఠమైన 6.52కి పెద్ద దూరం లేకపోవడమూ ఇబ్బందికరమే. తద్వారా వడ్డీరేట్లను పెంచాల్సిన అవసరం ఏర్పడుతుంది. దీంతో గత ఏడేళ్లలో అత్యధిక వడ్డీరేట్లు రికార్డు అయ్యే ప్రమాదమూ ఉంది.
మార్చి నుంచి తగ్గవచ్చు
ఇక ఆహార ద్రవ్యోల్బణం విషయానికొస్తే, గత నెలలో 5.95 శాతం నమోదైనట్లు కేంద్రం వెల్లడించింది. జనవరిలో రికార్డ్ అయిన 5.94 శాతంతో పోలిస్తే పెద్ద తేడా ఏమీ కనిపించలేదు. కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్(CPI)లో దీనికి 39 శాతానికిపైగా వెయిటేజీ ఉందన్న విషయాన్ని గమనించాల్సి ఉంది.
మార్చిలో CPI ద్రవ్యోల్బణం 6 శాతానికి, రానున్న నెలల్లో 5 శాతానికి తగ్గుతూ పోతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో వచ్చేనెలలో వడ్డీరేట్లను RBI మరో 25 బేస్ పాయింట్లు పెంచనున్నట్లు MOFSL గ్రూప్ చీఫ్ ఎకనామిస్ట్ నిఖిల్ గుప్తా అభిప్రాయపడ్డారు.
RBI రేట్ల పెంపు తప్పకపోవచ్చు
“ముందుగా భయపడినట్లుగానే CPI ద్రవ్యోల్బణం వరుసగా రెండోసారీ 6 శాతం పైగానే నమోదయింది. తృణధాన్యాలు, పాలు, పండ్లు, టొబాకో వంటి పలు వస్తువుల పెరుగుదల వల్ల కన్స్యూమర్ ఇండెక్స్ లో ఈ మేరకు తేడాలు వచ్చినట్లు ఇక్రా చీఫ్ ఎకనమిస్ట్ అదితి నాయర్ పేర్కొన్నారు.
ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే.. మానిటరీ పాలసీ కమిటీ మరోసారి రేట్ల పెంపు గురించి ఆలోచించాల్సిన అవసరం ఉందని అర్థమవుతోందన్నారు. అయితే రానున్న 3 వారాల్లో ఒకవేళ అంతర్జాతీయ అంశాలు ప్రభావితం చేస్తే తప్ప RBI నిర్ణయంలో మార్పు ఉండదని భావిస్తున్నట్లు చెప్పారు.