
Rains: రాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్నాయి. మధ్యాహ్నం వేళ బయటకు వెళ్లాలంటే ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. తెలంగాణలోని పలు జిల్లాల్లో 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అయితే, రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వచ్చే రెండ్రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
దక్షిణ తెలంగాణ ప్రాంతం నుంచి రాయలసీమ, తమిళనాడు మీదుగా గల్ఫ్ ఆప్ మన్నార్ వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. ఇది సముద్రమట్టం నుంచి సగటున 0.9కిలోమీటర్ల ఎత్తువరకు ఉంది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని దక్షిణ ప్రాంత జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు, ఒకట్రెండు చోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
మరోవైపు రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. శుక్రవారం అదిలాబాద్ జిల్లాలో 40.3 డిగ్రీల సెల్సియస్ గరిష్ఠ ఉష్ణోగ్రత, మెదక్ జిల్లాలో 22.8డిగ్రీల కనిష్ణ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అయితే, రానున్న మూడ్రోజులు ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా నమోదవుతాయని వాతావరణ శాఖ వివరించింది.