ఆనందంలో ఉద్యోగులు..
ఇంకా కొన్ని రోజుల్లో ఈ ఏడాది ముగుస్తున్న తరుణంలో విప్రో ఉద్యోగుల్లో సంబరాలు ప్రారంభించారు. ఎందుకంటే కంపెనీ తన ఉద్యోగులకు ఎంప్లాయిస్ స్టాక్ ఆప్షన్ ప్లాన్(ESOP) స్కీమ్ కింద కంపెనీలో వాటాలను అందిస్తోంది. కంపెనీ తన వృద్ధి పథంలో కొనసాగుతున్నప్పుడు తమ ఉద్యోగులకు ఇలాంటివి అందిస్తుంటాయి. వీటిని కంపెనీలోని ఉన్నత స్థాయి ఎగ్జిక్యూటివ్లు, ముఖ్య స్థానాల్లో ఉండే ఉద్యోగులకు ఇస్తుంటాయి. అయితే ప్రస్తుతం స్టార్టప్ కంపెనీలు మంచి పనితీరు కనబరిచే ప్రతిభావంతులైన ఉద్యోగులకు ఇలా వాటాలను అందిస్తున్నాయి.
ఉద్యోగులకు అందజేత..
దేశంలోని నాలుగవ అతిపెద్ద ఐటీ సంస్థగా ఉన్న విప్రో ADS Restricted Stock Unit Plan 2004 కింద ఈఎస్ఓపీ షేర్లను అందించింది. 1,70,206 షేర్లను ఈ స్కీమ్ కింద అర్హులైన ఉద్యోగులకు అందజేసింది. అయితే ఈ షేర్లను ఎవరెవరికి ఇచ్చారనే విషయాలను మాత్రం కంపెనీ వెల్లడించలేదు. ఈ షేర్ల మెుత్తం విలువ రూ.6.7 కోట్లుగా ఉంది. సెప్టెంబర్ త్రైమాసికంలో విప్రో 14.6 శాతం ఆదాయ వృద్ధిని నమోదు చేయడంతో కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది.
వేరియబుల్ పే..
విప్రో గడచిన త్రైమాసికంలో అదనపు ఉద్యోగులకు వేరియబుల్ వేతనాన్ని తగ్గించగా, పెరుగుతున్న లాభాల కొలమానాలను పరిగణనలోకి తీసుకుని, సెప్టెంబర్ త్రైమాసికంలో A నుంచి B3 గ్రేడ్ కింద పనిచేస్తున్న ఉద్యోగులందరికీ పూర్తి వేరియబుల్ వేతనాన్ని ప్రకటించింది. ప్రస్తుతం కంపెనీ ఆదాయం పెరుగుదలకు అనుగుణంగా ఈఎస్ఓపీని తెరమీదకు తెచ్చింది. అలా టీమ్ లీడ్ స్థాయి ఉద్యోగుల వరకు వేరియబుల్ పేని కంపెనీ అందించింది.
కొత్త చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్..
విప్రో తన పనితీరును మెరుగుపరిచేందుకు ఇటీవలే కొత్త చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ను నియమించింది. కంపెనీ కొత్త సీఈవోగా అమిత్ చెలాత్రి నియమితులయ్యారు. విప్రోలో చేరడానికి ముందు ఆయన క్యాప్జెమినీ ఫైనాన్షియల్ సర్వీసెస్ బిజినెస్ యూనిట్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ గా, దాని ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడిగా పనిచేశారు.