ఎయిర్‌టెల్‌ ఇన్వెస్టర్లకు అంబానీ తలనొప్పి – లాభాలు లాక్కునే కొత్త ప్లాన్‌!

[ad_1]

Jio – Airtel Tariff Plans War: భారతదేశ ప్రీ-పెయిడ్ మొబైల్ మార్కెట్‌లో రారాజు, ఆసియాలోనే అత్యంత సంపన్నుడు అయిన ముకేష్‌ అంబానీ (Mukesh Ambani), ఇప్పుడు పోస్ట్‌-పెయిడ్‌ మార్కెట్‌లోనూ రారాజుగా ఎదిగే ప్లాన్‌లో ఉన్నారు. ప్రత్యర్థి కంపెనీ భారతీ ఎయిర్‌టెల్‌ను (Bharti Airtel) గద్దె దించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం ‘ధర’ను ఆయుధంగా వాడుతున్నారు.

భారతదేశంలో అతి పెద్ద టెలికాం ప్లేయర్ అయిన రిలయన్స్ జియో (Reliance Jio), కొత్త పోస్ట్‌-పెయిడ్‌ ఫ్యామిలీ ప్లాన్స్‌ లాంచ్‌ చేసింది. ఈ ప్లాన్స్‌ రూ. 399 నుంచి స్టార్ట్‌ అవుతాయి. ఫ్యామిలీ ప్లాన్‌లో రూ. 99 కనీస ధరకే యాడ్-ఆన్ కనెక్షన్ ఇస్తోంది.

సూపర్‌ టైమింగ్‌
జియో కొత్త ప్లాన్, ఇతర పోటీ కంపెనీ కంటే దాదాపు 30% చౌక. అంతేకాదు… లాభాలు సరిపోక ఒత్తిడితో ఉన్న టెలికాం రంగం, టారిఫ్‌ల పెంపుపై ఆలోచిస్తున్న సమయంలో ఈ ప్లాన్‌ను ముకేష్‌ అంబానీ తీసుకొచ్చారు.

పోస్ట్‌-పెయిడ్‌లో చౌకైన కొత్త ప్లాన్‌తో జియో పోటీ ఇచ్చేసరికి ఎయిర్‌టెల్‌ ఇరకాటంలో పడింది. ఇప్పుడు ఈ కంపెనీ టారిఫ్‌ పెంచలేదు. దీనివల్ల ఎయిర్‌టెల్‌ ఆదాయం & లాభంలో పెరుగుదల ఉండదు. ఫైనల్‌గా ఎయిర్‌టెల్ స్టాక్‌ ఇన్వెస్టర్లకు నష్టం వాటిల్లుతుందని మార్కెట్ పరిశీలకులు అంటున్నారు.

గత 3 నెలల్లో భారతీ ఎయిర్‌టెల్ షేర్లు దాదాపు 8% క్షీణించాయి. 

“ప్రీ-పెయిడ్‌లో జియో చూపిస్తున్న దూకుడు ఇప్పటివరకు పోస్ట్‌-పెయిడ్ విభాగంలో లేదు. ఇప్పుడు, దీని కొత్త ఫ్యామిలీ పోస్ట్‌-పెయిడ్ ఆఫర్స్‌ ఆకర్షణీయమైన ధరల్లో ఉన్నాయి. ఇది పోస్ట్‌-పెయిడ్‌ సెగ్మెంట్‌లో కొత్త ధరల పోటీకి దారి తీయవచ్చని మేం భావిస్తున్నాం” – కోటక్ అనలిస్ట్‌లు ఆదిత్య బన్సాల్, అనిల్ శర్మ

15 రోజుల క్రితం మిత్తల్ ప్రకటన
భారతి ఎంటర్‌ప్రైజెస్ చైర్మన్ సునీల్ మిత్తల్ (Sunil Mittal) పక్షం రోజుల క్రితం ఒక ప్రకటన చేశారు. ఈ ఏడాది మధ్యలో ఎయిర్‌టెల్‌ ప్లాన్ల రేటు పెంపు ఉండే అవకాశం ఉందని చెప్పారు. ఈ ప్రకటన తర్వాత అంబానీ తీసుకొచ్చిన కొత్త పోస్ట్‌-పెయిడ్‌ ప్లాన్‌తో ఎయిర్‌టెల్‌ నీరుగారింది.

టెలికాం రంగంలో పోస్ట్‌-పెయిడ్‌ కంటే ప్రీ-పెయిడ్‌ సెగ్మెంట్‌ చాలా పెద్దది. ఇంత భారీ మొత్తంలో ఉన్న ప్రీ-పెయిడ్ డేటా విభాగంలో జియో దూకుడుగా వ్యవహరిస్తుందని (చౌక ప్లాన్స్‌ తెస్తుందని) ఎనలిస్ట్‌లు ఆశించడం లేదు. ఎందుకంటే, ఈ సెగ్మెంట్‌లో ఇది మార్కెట్ లీడర్‌. 5G స్పెక్ట్రం ఖర్చును బ్రేక్‌-ఈవెన్‌ చేయడానికి (లాభనష్టాలు లేని స్థితికి చేరడానికి), పోటీ కంపెనీల కంటే ఎక్కువగా (జియోకు 12% పెంపు, సహచరులకు 4% పెంపు) ఈ కంపెనీయే టారిఫ్స్‌ పెంచాల్సిన అవసరం ఉంది. 

టెలికాం కంపెనీల ARPUలో తగ్గే ప్రతి 10 రూపాయలకు.. జియో, ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఐడియా ఏకీకృత ఎబిటా వరుసగా 2%, 3%, 10% చొప్పున తగ్గే ఛాన్స్‌ ఉందని కోటక్‌ ఎనలిస్ట్‌లు వెల్లడించారు. కాబట్టి, 2023 రెండో అర్ధ భాగంలో ప్రీ-పెయిడ్ డేటా ప్యాక్‌లపై 20% టారిఫ్ పెంపు ఉండొచ్చని ఆశిస్తున్నారు. 

రిలయన్స్‌ షేర్‌కు ‘బయ్‌’ రేటింగ్‌ + రూ. 3,000 టార్గెట్ ధరను కోటక్‌ ఎనలిస్ట్‌లు ప్రకటించారు. ఎయిర్‌టెల్‌కు రూ. 875 టార్గెట్ ధరతో ‘యాడ్’ రేటింగ్‌ కంటిన్యూ చేశారు. దలాల్ స్ట్రీట్‌లో ఎయిర్‌టెల్‌ ఒక సూపర్‌ కౌంటర్‌గా కొనసాగుతోంది. ఈ స్టాక్‌ను ట్రాక్‌ చేస్తున్న 30 మంది విశ్లేషకుల్లో 25 మంది ‘బయ్‌’ రేటింగ్ ఇచ్చారు.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని ‘abp దేశం’ చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *