పెరగనున్న ఈఎంఐల భారం..
ఇటీవల జరిగిన ఎంపీసీ మీటింగ్ లో రిజర్వు బ్యాంక్ రెపో రేటును మళ్లీ పెంచింది. దీని తర్వాత దేశంలోని చాలా బ్యాంకులు తమ వడ్డీ రేట్లను సవరించాయి. ఈ కారణంగా మార్చి 1 నుంచి లోన్ రేట్లు భారంగా మారనున్నాయి. ఇవి సామాన్యులను ఆర్థికంగా ప్రభావితం చేస్తాయి.

గ్యాస్ ధరల మార్పు..
దేశంలోని చమురు కంపెనీలు ప్రతినెల మెుదటి తారీఖున LPG, CNG, PNG గ్యాస్ ధరలను సవరిస్తుంటాయి. అయితే ఫిబ్రవరిలో మాత్రం బడ్జెట్ కారణంగా చమురు కంపెనీలు రేట్లలో ఎలాంటి మార్పులు చేయలేదు. అయితే ఈ సారి ధరల్లో మార్పులు చేయవచ్చని తెలుస్తోంది.

6 శాతం DA పెంపు..
పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు మార్చి 1 నుంచి బేసిక్ పే పై 6 శాతం డీఏ పొందుతారని నోటిఫికేషన్ ద్వారా వెల్లడించింది. ఆరవ పే కమిషన్ సిఫార్సులకు అనుగుణంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో అన్ని స్థాయిల్లో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు ఈ పెంపు వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.

పాన్-ఆధార్ లింక్..
ఇటీవల జరిగిన బడ్జెట్ 2023 సమావేశాల్లో పాన్ కార్డును అన్నిచోట్లా గుర్తింపు కోసం అంగీకరించవచ్చని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటంచిన సంగతి తెలిసిందే. అయితే పాన్ కార్డు నిరుపయోగంగా మారకుండా ఉండాలంటే ఇందుకోసం ప్రభుత్వ సూచనల మేరకు దానిని ఆధార్ కార్డుతో లింక్ చేయాల్సి ఉంటుంది. పాన్ కార్డు ఎంతకీలకమైన గుర్తింపు పత్రమో మనందరికీ తెలిసిందే.. అందువల్ల మార్చి 31 నాటికి పూర్తి చేయాలి. ఆ తర్వాత లింక్ కాని వాటిని కేంద్రం నిలిపివేయనుంది.

ట్రైన్ షెడ్యూల్ మార్పులు..
మార్చి 1 నుంచి భారతీయ రైల్వేలు తమ షెడ్యూల్ లో కొన్ని మార్పులు చేయవచ్చు. దీని కారణంగా కొన్ని రైళ్ల రాకపోకల వేళలు మారే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరైనా ప్రయాణాలను ప్రారంభించాలనుకున్నప్పుడు తప్పకుండా మారిన రైలు ప్రయాణ సమయాలను తప్పక తెలుసుకోవాలి. దీనివల్ల ప్రయాణం సులభతరంగా మారుతుంది.

బ్యాంక్ సెలవులు..
ప్రతినెల మాదిరిగానే ఈ నెల కూడా దేశంలోని బ్యాంకుల సెలవులకు సంబంధించి రిజర్వు బ్యాంక్ క్యాలెండర్ తప్పక తెలుసుకోవాలి. మార్చి నెలలో దేశంలోని ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు ఏకంగా 12 రోజుల పాటు మూసివేయబడి ఉండనున్నాయి. ఈ నెలలో హోలీతో పాటు మరికొన్ని పండులు ఉన్నందున కస్టమర్లు తమ పనులను పూర్తి చేసుకునేందుకు ముందుగానే బ్యాంక్ సెలవులను తెలుసుకోవటం ఉత్తమం. దీనివల్ల ముఖ్యమైన పనులు పెండింగ్ పడకుండా ఉంటాయి.