ప్రస్తుతం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. సౌతాఫ్రికాలోని జోహన్నెస్బర్గ్లో పర్యటిస్తున్నారు. 15 వ బ్రిక్స్ సమావేశంలో పాల్గొనేందుకు ప్రధాని మోదీ.. అక్కడికి వెళ్లారు. అయితే భారత్కు ప్రతిష్ఠాత్మకమైన, ఎంతో కీలకమైన చంద్రయాన్ 3 ప్రయోగంలోని విక్రమ్ ల్యాండర్ జాబిల్లిపై దిగే క్షణంలో ఆయన భారత్లో ఉండటం లేదు. ఇందు కోసమే ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ ప్రక్రియను ఇస్రో లైవ్ టెలికాస్ట్ చేస్తుండగా.. ఆ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ సౌతాఫ్రికా నుంచి వర్చువల్గా పాల్గొననున్నారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఆగస్టు 23 వ తేదీ సాయంత్రం 6.04 గంటలకు చంద్రుడిపై విక్రమ్ ల్యాండర్ కాలుమోపే క్షణాలను ప్రధాని మోదీ జోహన్నెస్బర్గ్ నుంచి వీక్షించనున్నట్లు తెలిపింది.
ఇక 2019 లో ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్ 2 ప్రయోగాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వీక్షించారు. అయితే సాంకేతిక కారణాలతో చంద్రయాన్ 2 ప్రయోగం విఫలమైంది. ల్యాండర్ వేగాన్ని అదుపు చేయలేకపోవడంతో అది లూనార్ ఉపరితలాన్ని గట్టిగా ఢీకొట్టి క్రాష్ అయింది. దీంతో ల్యాండర్ దెబ్బతిని ఇస్రోతో సంబంధాలు తెగిపోయాయి. దీంతో ఆ ప్రయోగం విఫలం కాడంతో అప్పటి ఇస్రో ఛైర్మన్ కె. శివన్ తీవ్ర భావోద్వేగానికి గురై ఏడ్చారు. దీంతో అక్కడే ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ.. శివన్ను కౌగిలించుకుని ఓదార్చారు.
చంద్రుడి ఉపరితలంపై చంద్రయాన్ 3 ప్రయోగంలోని విక్రమ్ ల్యాండర్.. విజయవంతంగా దిగితే.. జాబిల్లి దక్షిణ ధ్రువాన్ని చేరుకున్న మొట్టమొదటి దేశంగా భారత్ నిలవనుంది. మరోవైపు.. చంద్రుడిపై కాలు మోపిన నాలుగో దేశంగా కూడా రికార్డుల్లోకి ఎక్కనుంది. ఇప్పటివరకు అమెరికా, చైనా, రష్యా విడిపోక ముందు ఉన్న సోవియట్ యూనియన్ మాత్రమే ఇప్పటివరకు చంద్రునిపై సాఫ్ట్ ల్యాండింగ్ అయ్యాయి. 50 ఏళ్ల తర్వాత ఇటీవల రష్యా ప్రయోగించిన లూనా 25 స్పేస్క్రాఫ్ట్.. ల్యాండింగ్ సమయంలో కూలిపోయింది.
Read More Latest Science & Technology News And Telugu News